ఆంధ్రప్రదేశ్లో రాజధాని అంశం.. ఇప్పట్లో తేలేలా లేదు. మూడు రాజధానుల్లో భాగంగా విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ఇప్పటికే అధికార వైసీపీ ప్రకటించింది. ఆ దిశగా అడుగులు వేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మరోవైపు అమరావతి రైతులు మాత్రం.. ఒక్కటే రాజధాని ఉండాలని.. అది కూడా అమరావతి మాత్రమే కావాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ప్రసుత్తం ఈ రాజధాని అంశం ఓ కొలిక్కి వచ్చే సూచనలు కనిపించడం లేదు. రాజధాని పంచాయతీ ఇలా కొనసాగుతుండగానే.. తాజాగా విశాఖకు సంబంధించి మరో కొత్త వార్తపై రాజకీయ వర్గాల్లో ఓ చర్చ జోరుగా నడుస్తోంది. అది ఏంటంటే.. విశాఖపట్టణాన్ని.. కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తారంటూ.. జోరుగా ప్రచారం సాగుతుంది. మరి నిజంగానే కేంద్రం వైజాగ్ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటిస్తుందా.. దాని వల్ల బీజేపీ ఎదుర్కొనే పరిణామాలు తదితర వాటి గురించి ఓ సారి పరిశీలిద్దాం..
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల మీద తన పట్టు సాధించే ప్రయత్నం చేస్తోంది. దానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. అలానే తెలుగు రాష్ట్రాల్లోనూ.. బీజేపీ తన పట్టు పెంచుకునేందుకు గాను.. రకరకాలు ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తన రాజకీయాల కోసం రెండు తెలుగు రాష్ట్రాలను వాడుకుంటుందని.. దానిలో భాగంగా.. రాష్ట్రాలకు రెవెన్యూ లేకుండా చేసి.. తమ గుప్పిట్లోకి తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తోందని గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. అంతేకాక.. రాష్ట్ర విభజన సమయంలో.. ఇరు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ గడువు ముగియగానే.. విశాఖను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించే అవకాశం ఉందని.. జోరుగా ప్రచారం సాగుతోంది.
అయితే ఇలాంటి ఆలోచన చేయడానికి కేంద్రం వద్ద కొన్ని కారణాలు ఉన్నాయి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రక్షణ పరంగా చూసుకుంటే.. విశాఖ అత్యంత కీలకమైన ప్రాంతం. విశాఖలో కేంద్ర సంస్థలు నేవి, డిఫెన్స్, పోర్టులు ఉన్నాయి. కానీ ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు.. తమ రాజకీయ అవసరాల కోసం సుందర విశాఖ తీరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాయని.. విశాఖ తీర ప్రాంత భద్రత దృష్ట్యా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా.. దానిలో భాగంగా.. విశాఖ నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించవచ్చని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అటు కేంద్రంలోనూ దీని గురించి చర్చ జరుగుతుంది.. త్వరలోనే ఈ మేరకు ప్రకటన వెలువడనుందని… పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.
ఇక రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారీగా ఆదాయాన్ని, ఉపాధి అవకాశాలను కోల్పోయింది. ఇక ఏపీలో ఉన్న విశాఖ నగరమే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమైన ఆదాయ వనరుగా మారింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో.. కేంద్రం.. విశాఖను.. కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తే.. ఆర్థికంగా దెబ్బ తీసి.. పార్టీకి మరింత నష్టం వాటిల్లుతుంది. ఇప్పటికే ప్రత్యే హోదా విషయంలో.. బీజేపీ.. ప్రజలకు సమాధానం చెప్పుకునే పరిస్థితి లేదు. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కూడా ప్రజల్లోకి వెళ్ళలేకపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో.. తాజాగా విశాఖ కేంద్ర పాలిత ప్రాంతం అంటూ సాగుతున్న ప్రచారం.. బీజేపీకి మరింత నష్టం చేకురుస్తుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక బీజేపీపై వ్యతిరేకతతోనే ఇటువంటి ప్రచారం జరుగుతోందని అంటున్నారు.
అంతేకాక.. ఇదంతా తప్పుడు ప్రచారం అని.. విశాఖను కేంద్రపాలిత ప్రాంతం చేయడానికి ఒక శాతం అవకాశం కూడా లేదని అంటున్నారు. పైగా బీజేపీ.. కేంద్ర పాలిత ప్రాంతాలాను రాష్ట్రాలుగా మారుస్తున్న వేళ.. మరో కొత్త కేంద్ర పాలిత ప్రాంతాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదనే అంటున్నారు. విశాఖను కేంద్ర పాలిత ప్రాంతంగా మారిస్తే.. బీజేపీ రాజకీయంగా నష్టం తప్ప ఎలాంటి లాభం ఉండదు. ఇది కేంద్రంపై తీవ్ర వ్యతిరేకతను పెంచటానికి కారణం అవుతుంది అంటున్నారు రాజకీయ విశేషకులు. ఏది ఏమైనా విశాఖ నగరానికి కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేస్తారని జరుగుతున్న ప్రచారంపై బీజేపీకి డ్యామేజ్ జరిగే అవకాశం ఉన్న కారణంగానైనా, దీనిపై బీజేపీ నేతలు స్పందించాల్సిన అవసరం ఉంది. కేంద్రం కూడా దీనిపై క్లారిటీ ఇస్తే బాగుంటుంది అన్న అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. మరి కేంద్రం నిజంగానే.. విశాఖను కేంద్రపాలిత ప్రాంతంగా మారుస్తుందని మీరు భావిస్తున్నారా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.