తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించబోతున్న పథకం దళిత బంధు. దీనిపై సర్కార్ ఇప్పటికే అన్ని రకాల ప్రణాళికలు రూపోందించి పథకం అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆదివారం జరిగిన రాష్ట్ర కేబినెట్లో మంత్రి వర్గం దీనిని తీర్మానించింది. అందుకు పూర్తిస్థాయిలో అధికార యంత్రాంగం సిద్ధం కావాలని కేబినెట్ ఆదేశించింది. దళిత బంధు పథకం అమలు, విధి విధానాల రూపకల్పనపై కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర కేబినెట్ విస్తృతంగా చర్చించింది.
పథకం అమలుకు అన్ని రకాల ప్రణాళికలు రూపొందించారు. ఇక ఈ పథకాన్ని హుజురాబాద్లో పైలెట్ ప్రాజెక్ట్గా ప్రయోగం చేస్తూ ఆగస్టు 16 నుండి అమలుకు అధికార యంత్రాంగం అంతా సిద్దం చేస్తున్నారు. ఇక హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో అమలు కాబోతున్న ఈ పథకంపై రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతమైన చర్చ జరుగుతోంది.
ఈ నేపథ్యంలో దళిత బంధు పథకానికి చట్ట బద్దత కల్పిస్తూ ప్రత్యేక చట్టంగా రూపోందించాలని అధికార యంత్రాంగం తీవ్ర కసరత్తులు చేస్తోంది. ఇక ముఖ్యంగా ఈ పథకాన్ని హుజురాబాద్లో ప్రయోగించి ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అమలు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఈ నేపథ్యంలో దళిత బంధు పథకంపై ప్రతిపక్షాల నుంచి భిన్నవాదనలు వినిపిస్తున్నాయి.