రాజకీయాల్లో ఎప్పుడు, ఎలాంటి పరిస్థితిలు ఏర్పడుతాయో ఎవ్వరూ చెప్పలేరు. అందుకే ఇక్కడ శాశ్విత శత్రువులు, శాశ్విత మిత్రులు అంటూ ఎవ్వరూ ఉండరు. ఆయా పరిస్థితిలు మాత్రమే నేతలను నడిపిస్తూ ఉంటాయి. కేసీఆర్, ఈటల రాజేందర్ మధ్య వార్ ఈ విషయాన్ని మరోసారి రుజువు చేసింది. కొన్నేళ్ల పాటు ఉద్యమంలో అన్నదమ్ములలా తిరిగారు వీరిద్దరూ. కలసి అధికారాన్ని కూడా పంచుకున్నారు. అలాంటి వీరి మధ్య ఇంత గ్యాప్ వస్తుందని ఎవ్వరూ ఉహించి ఉండరు. కానీ.., వరుసగా జరుగుతూ వస్తున్న రాజకీయ పరిస్థితిల నడుమ ఇప్పుడు రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అంతేగాక, ఈసారి బీజేపీ అభ్యర్థిగా హుజురాబాద్ నుండి పోటీకి సిద్దమయ్యారట రాజేందర్. ఇటీవల ఢిల్లీకి పయనమైన రాజేందర్.. అక్కడ బీజేపీ అగ్రనేతలను కలిశారు. తాను బీజేపీలోకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందనే దానిపై చర్చించారు. ఒకానొక సమయంలో తానే ఓ కొత్త పార్టీ పెడతాను. తనకు బీజేపీ సపోర్ట్ ఇవ్వాల్సిందిగా కోరాడట రాజేందర్. అయితే.., ఇలా చేస్తే ప్రభుత్వ వ్యతిరేఖ ఓటు చీలుతుంది. అప్పుడు కేసీఆర్ కే ప్లస్ అవుతుందని నడ్డా నచ్చచెప్పడంతో కొన్ని కండీషన్స్ తో రాజేందర్ బీజేపీలో చేరడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది.
జూన్ 8న గాని, లేదా 9 తేదీల్లో రాజేందర్ బీజేపీలో చేరే కార్యక్రమం ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఈ లోపే ఆయన టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి, హుజురాబాద్ ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయనున్నట్లు సమాచారం. ఈటల తోపాటు మరో కొంతంది టి.ఆర్.ఎస్ నేతలు బీజేపీలో చేరబోతున్నారట. ఒకరకంగా ఇది తెలంగాణలో బీజేపీ కి మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. ఇందుకే రాజా సింగ్, విజయశాంతి, డీకే అరుణ లాంటి నేతలు ఈటల రాకకు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తపరచడం లేదు. ఈటల తర్వాత కూడా చాలా మంది గులాబీ నాయకులు బీజేపీలో చేరే అవకాశం ఉండటంతో వీరంతా తమ పాత స్పర్ధలు పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈటల రాజీనామతో హుజురాబాద్ నియోజకవర్గంలో రాబోయే ఎన్నికలను ఎదుర్కోడానికి అధికార పార్టీ కూడా అప్పుడే సిద్ధమైపోయినట్టు తెలుస్తోంది. ఇందు కోసం జిల్లా మంత్రి గంగుల కమలాకర్ తన అన్నీ శక్తులను ఒడ్డుతున్నారు. హుజురాబాద్ లో గనుక ఈటలను ఓడిస్తే.., ఇక తనను, తన అధికారాన్ని ప్రశ్నించే గొంతులు లేవకుండా ఉంటాయన్నది గులాబీ బాస్ ప్లాన్. తన రాజకీయ ప్రత్యర్ధులు అంతా కలసి ఇప్పుడు ఈటల రాజేందర్ కి సపోర్ట్ చేస్తారని కేసీఆర్ కి తెలుసు. ఇందుకే ఆయన కూడా హుజురాబాద్ ఉపఎన్నికను సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది. మరి.., రానున్న కాలంలో ఈ పొలిటికల్ వార్ ఎలాంటి పరిణామాలకి దారి తీస్తుందో చూడాలి.