మన దేశంలో 18 ఏళ్లు నిండితేనే మేజర్గా గుర్తింపు లభిస్తుంది.. ఓటు హక్కు కూడా అప్పుడే వస్తుంది. తొలుత ఓటు హక్కు రావాలంటే 21 ఏళ్లుగా ఉండేది. కానీ రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు దాన్ని 18 ఏళ్లకు తగ్గిస్తూ రాజ్యాంగ సవరణ చేశారు. దాని ప్రకారం జనవరి 1 నాటికి 18 ఏళ్ల వయసులోకి అడుగు పెట్టిన వారు మాత్రమే ఓటర్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఈ క్రమంలో తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఓటర్ కార్డు కోసం 18 ఏళ్లు నిండే వరకు వేచి చూడాల్సిన అవసరం లేదని ప్రకటించింది. 17 ఏళ్లు నిండిన యువత ఓటర్ కార్డు కోసం ముందస్తుగా దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పిస్తున్నట్లు స్పష్టం చేసింది.
జనవరి 1వ తేదీ ఎప్పుడొస్తుందా అని వేచి చూడకుండా 17 ఏళ్ల వయసు దాటిన వారు ఓటర్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే.. 18 ఏళ్లు నిండిన తర్వాతనే ఓటర్ కార్డు అందిస్తారు. కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్, ఎలక్షన్ కమిషనర్ అనుప్ చంద్ర పాండేల నేతృత్వంలోని ఈసీఐ.. అన్ని రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లు, ఈఆర్ఓ, ఏఈఆర్ఓలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. 17 ఏళ్లు పైబడిన యువత ఓటర్ జాబితాలో పేరు నమోదుకు ముందస్తుగా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని సూచించింది. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని తెలిపింది.
ఏడాదిలో మూడుసార్లు అవకాశం..
యువత కేవలం జనవరిలోనే కాకుండా ఏప్రిల్ 1, జులై 1, అక్టోబర్ 1వ తేదీల్లో ఓటర్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది ఈసీ. ప్రతి త్రైమాసికానికి ఓటర్ జాబితాను అప్డేట్ చేస్తారు. దాంతో ఆ మధ్య 18 ఏళ్లు నిండిన వారికి ఓటర్ కార్డు జారీ చేశారు. 2023లో ఏప్రిల్ 1 లేదా జులై 1 లేదా అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్లు నిండే ప్రతి ఒక్కరు అడ్వాన్స్గా ఓటర్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం ఆర్పీ యాక్ట్ 1950లోని సెక్షన్ 14బీ, రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టోర్స్ రూల్స్, 1960 చట్టాల్లో మార్పులు చేసింది న్యాయశాఖ. దరఖాస్తు ఫారాలను సైతం యూజర్ ఫ్రెండ్లీగా మార్చనుంది ఈసీ. కొత్త దరఖాస్తు ఫారాలు 2022, ఆగస్టు 1వ తేదీ తర్వాత అందుబాటులోకి రానున్నాయి. అయితే.. ఆలోపు పాత దరఖాస్తుల్లో వివరాలు అందించిన వారికి అనుమతిస్తారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.