ఉత్తరాఖండ్- ఈ సృష్టిలో మహిళ జీవితం ప్రత్యేకమైందని చెప్పాలి. ప్రతి అమ్మాయి జీవితంలో రెండు ప్రధానమైన ఘట్టాలుంటాయి. అందులో ఒకటి పెళ్లి, రెండవది తల్లి కావడం. ప్రతి మహిళ జీవితం ఓ బిడ్డకు జన్మనివ్వడంతో సార్దకమవుతుందని చెబుతారు. అందుకే తల్లి అయ్యి, అమ్మా అని బిడ్డ చేత పిలిపించుకోవాలని పెళ్లైన మహిళలు తహతహలాడుతుంటారు.
కానీ పెళ్లైనా తల్లి కాకపోతే మాత్రం ఆమె బాధ వర్ణణాతీరం. తల్లి కావడానికి ఎన్నో పూజలు చేసి, నోములు నోస్తుంటారు చాలా మంది. కానీ ఉత్తరాఖండ్కు చెందిన ఒక మహిళకు తల్లి అయ్యే అదృష్టం దూరమైంది. ఆమె భర్త చేసిన తప్పుడు పని వల్ల అతను జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు. ఈ నేపధ్యంలో అమ్మతనానికి దూరమైన ఆ మహిళ తనకు న్యాయం చేయాలంటూ ఏకంగా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టును ఆశ్రయించింది.
ఉత్తరాఖండ్కు చెందిన సచిన్ అనే వ్యక్తి మరో ముగ్గురు ఫ్రెండ్స్తో కలిసి ఓ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసులో సచిన్తో పాటు మిగిలిన దోషులకు 20 ఏళ్ల జైలుశిక్ష పడింది. ఈ క్రమంలో తన భర్తకు షార్ట్ టర్మ్ బెయిల్ ఇవ్వాలంటూ అతడి భార్య హైకోర్టును ఆశ్రయించింది. తనకు అమ్మ కావాలన్న కోరిక ఉందని, తల్లి తనంలోని మాధుర్యం ఆస్వాదించాలనుకుంటున్నానని కోర్టుకు సమర్పించిన పిటీషన్ లో పేర్కొంది. భార్యగా తల్లి కావాలన్న తన హక్కును ప్రస్తావించింది.
తన భర్తకు కొంత కాలం బెయిల్ ఇస్తే తాను గర్భం దాల్చేందుకు అవకాశం ఉంటుందని హైకోర్టుకు విజ్ఞప్తి చేసిందా మహిళ. గతంలో ఎప్పుడూ ఇలాంటి పిటిషన్తో రాకపోవడంతో, ఇప్పుడు ఎలాంటి తీర్పు ఇవ్వాలన్నదానిపై ఉత్తరాఖండ్ హైకోర్టు తర్జనభర్జన పడుతోంది. ఈ కేసుపై తమకు సలహా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది కోర్టు. మరి దీనిపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఎలా స్పందించనుంది, ఆ తరువాత కోర్టు ఎలాంటి తీర్పు ఉవ్వనుందన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.