పలు దక్షిణాది చిత్రాల్లో నటించి మెప్పించిన సీనియర్ నటి జయంతి అనారోగ్యంతో కన్నుమూశారు. కొన్నేళ్లుగా ఆమె అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆరోగ్యం క్షీణించి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో బెంగుళూరులోని ప్రైవేటు హాస్పిటల్లో జాయిన్ చేశారు. చికిత్స పొందుతూ జయంతి కన్నుమూశారు. మూడు దశాబ్దాలుగా జయంతి అస్తమాతో బాధపడుతున్నారు. 1945 జనవరి 6న బళ్ళారి లో జన్మించిన జయంతి కన్నడ సినిమా ‘జెనుగూడు(1963)’తో తెరంగేట్రం చేశారు.
తెలుగు, తమిళ, హిందీ, మరాఠీ, కన్నడ, మలయాళ సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలను పోషించి నటిగా తనదైన ముద్ర వేశారు. సౌత్ ఇండియన్ భాషల్లో 500 లకు పైగా చిత్రాల్లో నటించిన ఆమె జాతీయ అవార్డులు సొంతం చేసుకున్నారు. 1960, 70 దశకాల్లో వెండితెరపై జయంతి హవా నడించింది. కన్నడ, తెలుగు, మళయాళం భాషల్లో నటించినా సొంతంగానే డైలాగులు చెప్పి ప్రత్యేకత చాటుకునేది జయంతి. కన్నడ ఇండస్ట్రీలో బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ నటిగా ఆమెకు గుర్తింపు లభించింది.
తెలుగులో భార్య భర్తలు సినిమాతో కెరీర్ ప్రారంభించి, తెలుగులో జగదేక వీరునికథ, డాక్టర్ చక్రవర్తి, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి, రక్త సంబంధం, భక్త ప్రహ్లాద, బడిపంతులు, దేవదాసు, మాయదారి మల్లిగాడు, స్వాతి కిరణం, పెదరాయుడు చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దిగ్గజ నటులు ఎంజీ రామచంద్రన్, ఎన్టీఆర్, రాజ్కుమార్, రజనీకాంత్లతో నటించారు. ఎన్టీఆర్, ఏఎన్నాఆర్, కృష్ణ ద్విపాత్రాభినయం చేసిన చాలా సినిమాల్లో తండ్రి పాత్రలకు ఈమె జోడిగా నటించింది.
ముఖ్యంగా ఎన్టీఆర్ నటించిన ‘జస్టిస్ చౌదరి’, ‘కొండవీటి సింహం’ వంటి సినిమాలున్నాయి. మరోవైపు ఏఎన్నార్ సరసన పలు చిత్రాల్లో కథానాయికగా నటించింది. కృష్ణ నటించిన ‘కుమార రాజా’ సహా చిత్రాల్లో రెండో హీరోయిన్గా నటించి మెప్పించింది. అంతేకాదు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మోహన్ బాబు వంటి హీరోలకు తల్లి పాత్రల్లో అలరించింది. ముఖ్యంగా చిరంజీవి ‘కొదమ సింహం’, బాలయ్య ‘వంశానికొక్కడు’, వెంకటేష్ ‘అజేయుడు’ వంటి చిత్రాలున్నాయి.
ఇక మోహన్ బాబు హీరోగా నటించిన పెదరాయుడు సినిమాలో రజినీకాంత్ చెల్లెలుగా మోహన్ బాబు మేనత్త పాత్రలో అలరించింది. ఈమె భర్త ప్రముఖ నటుడు, దర్శకుడు పేకేటి శివరామ్. కన్నడనాట ఈమె నెంబర్ వన్ హీరోయిన్గా రాజ్కుమార్, విష్ణువర్ధన్, అంబరీష్ వంటి అగ్ర నటుల సినిమాల్లో కథానాయికగా నటించి మెప్పించారు. ఈమె మృతి సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.