కన్నడ సూపర్ స్టార్, ప్రముఖ దర్శకుడు ఉపేంద్రపై కేసు నమోదు అయ్యింది.
హీరోలు ప్రదర్శించే హీరోయిజాలయందు కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర ప్రదర్శించే హీరోయిజమే వేరు. ఉపేంద్ర నటన మిగతా హీరోల శైలికి చాలా భిన్నంగా ఉంటుంది. దశాబ్ద కాలం క్రిందటే ఉపేంద్ర తన మాతృ భాష కన్నడంతో పాటు తెలుగు సినిమాల్లోనూ నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. పైగా ఏ హీరో సినిమాలకి లేని విధంగా ఉపేంద్ర హీరోగా నటించే సినిమాలకి ఉన్న స్పెషల్ ఏంటంటే తన సినిమాకి తానే కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వ బాధ్యతలను ఉపేంద్ర నిర్వహిస్తాడు. ఆయన సినిమాలకి ప్రేక్షకులు బ్రహ్మరథం కూడా పట్టారు. నేటి సమాజంలో జరిగే జుగుప్సాకరమైన చాలా విషయాలను తన సినిమాల్లో నిర్భయంగా చూపిస్తూ తన పదునైన మాటలతో యాక్టింగ్ తో వీరలెవల్లో వీరవిహారం చెయ్యడం ఉపేంద్ర సొంతం.
అలాగే ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ప్రజాకీయ అనే రాజకీయ పార్టీని ఉపేంద్ర స్థాపించారు . తాజాగా ప్రజాకీయ పార్టీ వార్షికోత్సవాల సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో ఉపేంద్ర దళితుల్ని ఉద్దేశించి మాట్లాడారు అనే వార్త కర్ణాటక వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతుంది. అసలు విషయానికొస్తే..ఉపేంద్ర పార్టీ వార్షికోత్సవాల్లో భాగంగా ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ ల ద్వారా ఉపేంద్ర లైవ్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమమే ఉపేంద్ర పాలిట శాపం అయ్యింది. ఈ కార్యక్రమంలో తన పార్టీ మీద కొంత మంది చేస్తున్న విమర్శలను ప్రశ్నిస్తూ కొన్ని ఉదాహరణలు చేసాడు.
ఆ ఉదాహరణలు తమ వర్గాన్ని అవమానించేలా ఉన్నాయని దళిత సంఘాలు ఉపేంద్ర మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఉపేంద్ర లాంటి వ్యక్తి అలా మాట్లాడటం సరి కాదని దళితులు అంటున్నారు. దళితుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో ఉపేంద్ర తాను మాట్లాడిన మాటల్ని సోషల్ మీడియా నుంచి డిలీట్ చేశారు.అలాగే తన మాటలు బాధపెట్టి ఉంటే క్షమించమని దళిత సంఘాలను క్షమాపణ కోరారు. కాగా ఉపేంద్ర మీద బెంగుళూరులోని చెన్నుమన్నై కోరే పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. మరి క్షమాపణలు చెప్పిన ఉపేంద్ర మీద ఉన్న కేసును వెనక్కి ఉపసంహరించుకుంటారో లేదో చూడాలి.