ఇంటర్నేషనల్ డెస్క్- సిరియాలోని ఇడ్లిబ్ ప్రావిన్సులో ఇస్లామిక్ స్టేట్- ఐఎస్ గ్రూప్ చీఫ్ ను అమెరికా దళాలు హతమార్చాయి. ఈమేరకు అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ ప్రకటించారు. ఎస్ చీఫ్ ను మట్టుపెట్టడానికి సంబందించిన ఆపరేషన్ పూర్తయ్యాక, తమ కమాండోలు తిరిగి సురక్షితంగా తమ స్థావరానికి చేరుకున్నట్టు జో బైడెన్ తెలిపారు.
రెండేళ్ల క్రితం అమెరికా కమాండోల దాడిలో ఇస్లామిక్ స్టేట్ చీఫ్ అబు బకర్ అల్ బగ్దాది హతమయ్యాక, 31 అక్టోబరు 2019న అబు ఇబ్రహీం అల్ హష్మిమి అల్ ఖురేషి ఈ ఉగ్రవాద గ్రూపు బాధ్యతలు చేపట్టాడు. అబూ బకర్ ను తుదముట్టించిన తర్వాత సిరియాలో అమెరికా చేపట్టిన రెండో అతిపెద్ద ఆపరేషన్ ఇదేనని తెలుస్తోంది.
ఇప్పుడు ఖురేషీని లక్ష్యంగా చేసుకుని అమెరికా ప్రత్యేక ప్రత్యేక దళాలు జరిపిన ఈ దాడిలో ఖురేషీ మరణించినట్టు అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. బాగ్దాదీ ఎక్కడ, ఎలా అయితే మరణించాడో, ఖురేషీ కూడా అలాగే మరణించాడని అమెరికా అధికారి ఒకరు చెప్పారు. ఈ దాడిలో ఖురేషీతో పాటు మహిళలు, పిల్లలు సహా అతడి కుటుంబ సభ్యులు కూడా చనిపోయినట్లు తెలిపారు.
ఐఎస్ చీఫ్ ఖురేషీని అమిర్ ముహమ్మద్ సైద్ అబ్దల్ రహ్మాన్ అల్ మావ్లా అని కూడా పిలుస్తారు. అమెరికా భద్రతా దళాల దాడిలో ఆరుగురు చిన్నారులు, నలుగురు మహిళలు సహా మొత్తం 13 మంది మరణించినట్టు అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. మిషన్ విజయవంతమైనట్టు పెంటగాన్ ప్రెస్ సెక్రటరీ జాన్ కిర్బీ ఓప్రకటనను విడుదల చేశారు.