క్రైం డెస్క్- సమాజంలో మానవ సంబంధాలకు మసిబారుతోంది. అక్రమ సంబంధాలకు కొంత మంది ఎక్కువ విలువిస్తున్నారు. కామవాంఛతో కుటుంబాల్లో చిచ్చు రేపుతున్నారు. అక్రమ సంబంధాలు హత్యలకు దారితీస్తున్న ఉదంతాలను ఎన్నో మనం చూస్తున్నాం. తూర్పుగోధావరి జిల్లాలో జరిగిన హత్య వెనుక అక్రమ సంబంధం ఉండటమేనని పోలీసులు తేల్చారు.
జిల్లాలోని మలికిపురం మండలం మేడిచర్లపాలెంలో సత్యనారాయణ కుటుంబం ఉంటోంది. తన భార్య సోదరుడి కుమార్తె, అంటే బావమరిదికూతురుతో కొడుకు విజయ్కుమార్కు ఏడేళ్ల క్రితం పెళ్లి జరిపించారు. వీరికి ఓ బాబు ఉన్నాడు. కొడుకు విజయ్ కుమార్ ఉపాధి కోసం ఖతార్ లో ఉంటున్నాడు. ఇక కోడలు, మనవడు అత్తింటిలోనే ఉంటోంది. కోడలి తల్లి కుటుంబ సభ్యులు అండమాన్లో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో కోడలు అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో అక్రమ సంబంధం నడుపుతోందని సత్యనారాయణకు తెలిసింది.
దీంతో తన ప్రవర్తను మార్చుకోవాలని కోడలిని హెచ్చరించాడు సత్యనారాయణ. అయినా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈ క్రమంలో కొడలు ఈ నెల 22న ఆ యువకుడితో కలిసి వెళ్లిపోయింది. దీంతో సత్యనారాయణ పోలీసులను ఆశ్రయించగా, వారు గాలింపు చేపట్టి, ఇద్దరిని వెతికి తీసుకొచ్చి, కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ నేపధ్యంలో కోడలి తల్లి అండమాన్ నుంచి వచ్చింది.
కోడలి ప్రవర్తనపై మళ్లీ వాగ్వాదం జరగడంతో ఆవేశంతో ఆమెను వంటగదిలో ఉన్న కత్తితో పొడిచాడు సత్యనారాయణ. కోడలు చనిపోయిందని నిర్ధారించుకున్నాక నేరుగా పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. కోడలు యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుని, తమ కుటుంబం పరువు తీసిందనే ఆవేశంలో ఆమెను హత్య చేసినట్లు సత్యనారాయణ చెప్పాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.