హైదరాబాద్- ఎర్ర బస్సు.. పల్లె వెలుగుగా ప్రజల ఆప్యాయత చూరగొన్న ప్రగతి రథ చక్రాల పరిస్థితి కొన్ని నెలల క్రితం వరకు అత్యంత దారుణంగా ఉంది. ఉద్యోగులకు సరిగా జీతాలు ఇవ్వలేక.. బకాయిలు చెల్లించలేని పరిస్థితిలో.. ఇక ప్రైవేట్ పరం చేయడం ఒక్కటే దారి అనే వాదన కూడా తెరపైకి వచ్చింది. మూత పడుతుంది.. ముగిసిపోయింది అనుకున్న పరిస్థితి నుంచి.. తనను తాను సంస్కరించుకుని.. లాభాల బాట పట్టింది టీఎస్ఆర్టీసీ.
ఒకప్పుడు విధులకు రావాలంటేనే భయపడిని సిబ్బంది.. ఇప్పుడు ఉత్సాహంతో విధులకు హాజరవుతున్నారు. ఉద్యోగులకు 23 రోజులు ఆలస్యంగా జీతాలు ఇచ్చిన పరిస్థితి నుంచి నెలాఖరునే వారి ఖాతాలో జీతాలు జమ చేసే స్థితికి చేరుకుంది. అయితే ఈ మార్పు అంత సులువుగా ఏం రాలేదు.. దీని వెనక ఓ వ్యక్తి ముందు చూపు.. నిరంతర తపన ఉంది. ఆయనే ఆర్టీసీ ఎండీ సజ్జనార్.
ఇది కూడా చదవండి : సజ్జనార్ సంచలన నిర్ణయాలు.. తోడుగా మహేష్ బాబు!
పోలీస్ డిపార్ట్ మెంట్ నుంచి సజ్జనార్ ని ఆర్టీసీ ఎండీగా నియమించిన రోజున ప్రధానంగా వినిపించిన మాట.. ‘ఆర్టీసీలో ఈయన ఏం చేస్తాడు.. ఆ సంస్థను బాగు పర్చడం ఎవరి తరం కాదు’ అనే మాటలు వినిపించాయి. అయితే వాటన్నింటిని అబద్ధం చేస్తూ.. ఆర్టీసీని లాభాల బాట పట్టించారు ఎండీ సజ్జనార్. ఇప్పుడు రోజువారీ టికెట్ ఆదాయం రూ.13 కోట్లకు చేరింది.
సజ్జనార్ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించే సమయానికి సంస్థలో రూ.మూడు వేల కోట్ల అప్పులు.. రూ.రెండు వేల కోట్ల నష్టాలు.. చమురు సంస్థలకు బకాయిలు.. గత వేతన సవరణ తాలూకు బకాయిలు ఉన్నాయి. బాధ్యతలు స్వీకరించిన తొలి రోజునే.. సిబ్బందికి ఒకటో తేదీనే జీతాలు ఇస్తామన్న నిర్ణయాన్ని వెల్లడించి దానికి కట్టుబడటం ద్వారా వారిలో సంస్థ పట్ల విశ్వాశాన్ని చూరగొనే ప్రయత్నం చేశారు.
ఆర్టీసీ ఉద్యోగులు, ప్రయాణికుల సమస్యలపై సజ్జనార్ స్వయంగా స్పందిస్తూ.. వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. ఆర్టీసీ ఆదాయాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు పలు సంస్కరణలకు నాంది పలికారు. ప్రయాణికులను ఆకట్టుకునే విధంగా పలు కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారు. అలానే ఆదాయం పెంచుకునేందకు పెళ్లిల్లకు ఆర్టీసీ బస్సులను అద్దెకు ఇస్తున్నారు. అడ్డ గోలు ప్రకటనలతో ఆర్టీసీ రూపురేఖలను అందవిహీనంగా మార్చిన చర్యలకు సజ్జనార్ బ్రేక్ వేశారు. ఆదాయం పోతుందని తెలిసినప్పటికి.. ప్రకటనలకు బ్రేక్ వేశారు. మహిళా కండక్టర్లకు రాత్రి 8 గంటల తర్వాత విధులు నిర్వహించకూడదని ఆదేశాలు జారీ చేశారు.
ఇది కూడా చదవండి : ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన సజ్జనార్
సజ్జనార్ సంస్కరణ ఫలితంగా ప్రస్తుతం బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో 66 శాతానికి చేరుకుంది. ఇది రెండేళ్లలో గరిష్టం. ఇక రోజుకు 35 లక్షల కి.మీ. గరిష్ట స్థాయిలో బస్సులు తిరుగుతున్నాయి. గతంతో పోలిస్తే వేయి బస్సులు తగ్గినా దాన్ని అందుకోవడం విశేషం. కొత్త బస్సులు కొనే ప్రసక్తే లేదని కొంతకాలం క్రితం తేల్చి చెప్పిన ఆర్టీసీ.. ఇప్పుడు తీరు మార్చుకుంటోంది. కొత్త బస్సుల అవసరాన్ని గుర్తించి కొనేందుకు సిద్ధమైంది.
ఇది కూడా చదవండి : సజ్జనార్ కీలక నిర్ణయం.. వారందరికి ఆర్టీసీలో ఉచిత ప్రయాణం