హుజూర్ నగర్ లో కొన్ని రోజుల క్రితం అధికారులు ఇందిరా గాంధీ, రాజశేఖర్ రెడ్డి విగ్రహాలను తొలగించిన సంగతి తెలిసిందే. ఇందుకు నిరసనగా.. టీపీసీసీ మాజీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి 2021, డిసెంబర్ 24 నుంచి హుజూర్ నగర్ చౌరస్తాలో ధర్నాకు దిగారు. విగ్రహాలను పునః ప్రతిష్టించేంత వరకు తాను ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించుకు కూర్చొన్నారు.
ఈ క్రమంలో తాజాగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. విగ్రహాలు పెట్టేదాక తాను అన్నం ముట్టనని తెలిపారు. నిరహార దీక్ష చేస్తానని ప్రకటించారు. ఇక ఉత్తమ్ కు మద్దతు తెలుపుతూ.. భార ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు హుజూర్ నగర్ చౌరస్తాకు తరలి వచ్చారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ… హుజూర్ నగర్ లో అత్యంత చారిత్రాత్మకంగా ఉన్న ఇందిర చౌకు దగ్గర ఏ రాజకీయాలు లేకుండా 40 సంవత్సరాల నుంచి ఇందిరమ్మ విగ్రహం ఉందన్నారు. ప్రియతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని బేస్ సిమెంట్ తో సహా తీసేయడం చాలా దురదృష్టకరమన్నారు. అరెస్టు చేసి జైలుకు పంపుతామంటున్నారని.. తాము దేనికైనా సిద్ధంగా ఉన్నానన్నారు. అందరి సంగతి చూస్తాము.. ఎవరిని వదిలిపెట్టమన్నారు. చారిత్రాత్మకంగా ఉన్న ఇందిరమ్మ విగ్రహాన్ని పోలీసుల సహకారంతో కూల్చివేయడం చాలా దురదృష్టకరమని ఉత్తమ్ వ్యాఖ్యానించారు.