సాధారణంగా ఎవరైన ఆస్తి కోసం, డబ్బుల కోసం ఘర్షణ పడుతుంటారు. కానీ జంతువుల కోసం ఫైటింగ్ చేసుకునే వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. అది కూడా గేదెలు, ఎద్దులు వంటి ఇతర పశువుల విషయంలో గొడవలు జరగడం అక్కడకక్కడ చూస్తుంటాం. కానీ తాజాగా పిల్లి విషయంలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణకు దారి తీసింది. చివరికి పిల్లి పంచాయితీ పోలీస్ స్టేషన్ కి చేరింది. ఈ విచిత్రమైన ఘటన సూర్యపేట జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. సూర్యపేట జిల్లా హుజుర్ నగర్ లోని దద్దనాల చెరువు కాలనీలో నివసించే మద్దేల మున్నా, అతని తల్లి ముత్యాలు మూడేళ్ల క్రితం మైసూర్ నుంచి ఓ రెండు పిల్లి పిల్లలను కొనుగోలు చేసి తెచ్చుకున్నారు. వీటిలో ఒక్క పిల్లి బావిలో పడి చనిపోగా మరో పిల్లి ఏడాది క్రితం తప్పిపోయింది. తల్లికొడుకులు ఎంత వెతికినా ఫలితం లేకపోయింది. హుజుర్ నగర్ లోని ఫణిగిరి ప్రాంతంలో సుక్కమ్మ అనే మహిళ కుటుంబం ఉంటుంది. అయితే ఇటీవల సుక్కమ్మ దగ్గర పిల్లిని చూసిన ఓ వ్యక్తి మున్నాకి సమాచారమిచ్చాడు. దీంతో మున్నా, అతని తల్లి సుక్కమ్మ ఇంటికి వెళ్లి పిల్లి గురించి ఆరా తీశారు.
ఈ క్రమంలో పిల్లి మాదంటే మాది అని ఇరు కుటుంబాల మధ్య మాటామాటా పెరిగింది. ఇది చివరికి ఘర్షణ వరకు వెళ్లింది. పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. మున్నా, ముత్యాలుకు రూ 5 వేలను ప్రస్తుతం పిల్లిని పెంచుకుంటున్న సుక్కమ్మ ఇచ్చేలా మాట్లాడి.. ఇరువర్గాలను ఎస్సై ఒప్పించారు. దీంతో సమస్య పరిష్కారం అయ్యింది. చూశారా.. ఆఖరికి పిల్లి కూడా రెండు కుటుంబాల మధ్య గొడవులకు కారణమైంది. మరి..ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.