కర్ణాటకలో ప్రారంభమైన హిజాబ్ వివాదం.. తెలంగాణకు వ్యాపించింది. హిజాబ్ కు మద్దతుగా హైదరాబాద్ లో విద్యార్థులు ఆందోళనలు నిర్వహించారు. నగరంలోని టిబ్బీ కాలేజీ విద్యార్థులు హిజాబ్ కు మద్దతుగా నిరసనలు తెలిపారు. చేతిలో ప్లకార్డులు పట్టుకుని తమ నిరసన తెలిపారు.
ఇక కర్ణాటక ఉడుపిలో ప్రారంభమైన హిజాబ్ వివాదం రాష్ట్రం అంతటా వ్యాపించింది. ఈ వివాదం కాస్త హింసాత్మకంగా మారడంతో.. రెండు మతాలకు చెందిన విద్యార్థులు ఘర్షణకు దిగారు. ఫలితంగా కర్ణాటక వ్యాప్తంగా కాలేజీలు, విద్యాసంస్థలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. విద్యార్థులు ఒకరి మీద ఒకరు రాళ్లు రువ్వుకునే వరకు వెళ్లింది. దీంతో కర్ణాటక ప్రభుత్వం 3 రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. బందోబస్తును పటిష్టం చేసింది. శివమొగ్గలో 144 సెక్షన్ విధించారు.
ఇక ఈ వివాదంపై విచారణ చేపట్టిన కర్ణాటక హైకోర్టు.. హిజాబ్ విషయమై దాఖలైన పిటిషన్ ను విస్తృత ధర్మాసనానికి కర్ణాటక సింగిల్ జడ్జ్ రిఫర్ చేసింది. ఈ విషయంలో విస్తృత ధర్మాసనం అవసరమని భావిస్తున్నామని జడ్జి క్రిషన్ దీక్షిత్ అభిప్రాయపడ్డారు. ఈ పిటిషన్ పై మధ్యంతర ఉత్తర్వులను కూడా విస్తృత బెంచే ఇస్తుందని సింగిల్ జడ్జి తెలిపారు. అంతేకాక బెంగళూరులో రెండు వారాల పాటు నిరసనలపై ఆంక్షలు విధించారు.