ఫిల్మ్ డెస్క్- బాలీవుడ్, శాండిల్ వుడ్, టాలీవుడ్ అన్న తేడా లేకుండా ఇప్పుడు అన్ని చోట్లా డ్రగ్స్ మాఫియా కలకలం రేపుతోంది. ఇప్పటికే శాండిల్ వుడ్ నుంచి హీరోయిన్లు సంజన, రాగిణి ద్వివేదీలకు ఉచ్చు బిగిస్తోంది. ఇటువంటి సమయంలో తెలుగు సినీ పరిశ్రమలో మరోసారి డ్రగ్స్ కేసు తెరపైకి వచ్చింది. నాలుగేళ్ల క్రితం టాలీవుడ్లో ప్రకంపనలు సృష్టించిన డ్రగ్స్ కేసును ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తిరగతోడుతోంది.
సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రితం తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖుల్లో చాలా మంది డ్రగ్స్ తీసుకుంటున్నాన్న ఆరోపణలు వచ్చాయి. ప్రధానంగా పూరి జగన్నాథ్, రవితేజ, ముమైత్ ఖాన్, ఛార్మీ వంటి వారిని హైదరాబాద్ మాదక ద్రవ్యాల నిరోధక విభాగం, నార్కోటిక్స్ విభాగం వారి ఆఫీసుకు పిలిచి విచారించడం కలకలం రేపింది.
సినీ ప్రముఖలు నుంచి గోర్లు, వెంట్రుకలు వంటి షాంపిల్స్ తీసుకున్నారు. అప్పట్లో ఈ కేసులో రానా దగ్గుబాటి, రకుల్ ప్రీత్ సింగ్, నవదీప్, తరుణ్, తనీష్ వంటి వారి పేర్లు కూడా వినిపించాయి. కానీ ఆ తరువాత ఏంజరిగిందో తెలియదు కానీ డ్రగ్స్ కేసు కాస్త మరుగున పడింది. ఇదిగో ఇన్నాళ్లకు మళ్లీ ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కొంత మంది సినీ సెలెబ్రిటీలకు నోటీసులను పంపించింది. డ్రగ్స్ కేసుకు సంబందించిన విచారణకు హాజరు కావాలని నోటీసులు ఈడీ పేర్కొంది.
ఆగస్ట్ 31న పూరి జగన్నాథ్, సెప్టెంబర్ 6న రకుల్ ప్రీత్ సింగ్, సెప్టెంబర్ 8న దగ్గుబాటి రానా, నవంబర్ 15న ముమైత్ ఖాన్ విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు ఆదేశించిందని సమాచారం. దీంతో మళ్లీ డ్రగ్స్ కేసు తెలుగు సినీ పరిశ్రమలో ఆందోళన కలిగిస్తోంది. అయితే తనకు ఈడీ నుంచి ఇంతవరకు ఎలాంటి నోటీసులు అందలేదని హీరో రవితేజ తెలిపినట్లుగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు.