క్రైం డెస్క్- సాధారనంగా పెళ్లిళ్లు.. ఇతర శుభకార్యాలలో దొంగలు తమ చేతి వాటం చూపడం చాలా సందర్భాలలో మీరు చూసే ఉంటారు. అంతా పెళ్లి సందడితో ఉంటే దొంగలు మాత్రం తన చోర కళను ప్రదర్శించి దొరికింది దోచుకుపోతుంటారు. మొన్నామధ్య మరుసటి రోజు పెళ్లి ఉండగా ఇంట్లో అంతా నిదురపోతున్న సమయంలో ఎంచక్కా పెళ్లి కోసం చేయించిన బంగారు నగలన్నీ ఎత్తుకెళ్లారు దొంగలు. తెల్లారి లేచి చూసి పెళ్లి వాళ్లు లభోదిబోమని.. పోలీసులకు పిర్యాదు చేశారు. ఇదిగో ఇలాంటి దొంగతనాలు పెళ్లిళ్లలో జరగడం సహజమే అనుకొండి. ఐతే పెళ్లిళ్లలో దొంగలు దోచుకెళ్లారంటే ఓకే.. కాని పెళ్లి జరిపించాల్సిన పురోహితుడే దొంగతనానికి పాల్పడితే పరిస్థితి ఏంటి. అదేంటి పురోహితుడు దొంగతనం చేయడమేంటని మీరు ఆశ్చర్యపోతున్నారా.. అసలు జరిగిందేంటంటే.. మెదక్ జిల్లా తుఫ్రాన్ లో ఓ వివాహ వేడుక జరిగింది.
పడాల పల్లికి చెందిన మునిరాతి పెంటయ్య, సుశీల దంపతులు కుమారుడు జ్ఞానేంధర్ దాసుకు, నర్సాపూర్ మండలం గొల్లపల్లికి చెందిన వసంతకు పెళ్లి జరిపించేందుకు పెద్దలు నిర్ణయించారు. ఈమేరకు వివాహ తంతును జరిపించేందుకు గజ్వేల్ కు చెందిన పురోహితున్ని మాట్లాడుకున్నారు పెళ్లి వారు. అనుకున్న ముహూర్తానికి పురోహితుడు వేద మంత్రాల సాక్షిగా వధూ వరులకు పెళ్లి జరిపించాడు. ఇంత వరకు బాగానే ఉంది కాని.. వివాహం జరిగిన కాసేపటికే పెళ్లి కూతురి మెడలో బంగారు మంగళ సూత్రం కనిపించకుండా పోయింది. దీంతో అంతా కంగారు పడిపోయారు. మూడు తులాల బంగారంతో చేయించిన మంగళసూత్రం, అది కూడా పెళ్లి జరగ్గానే పోవడంతో కుటుంబ సభ్యులంతా ఆవేధన చెందారు. పెళ్లి మంఠపంలో మంగళ సూత్రం ఎలా మాయమైందని మెల్లగా ఆరా తీశారు.
ఎలాగూ పెళ్లి తంతును వీడియో తీయడంతో వెంటనే ఆ వీడియో ఫుటేజీని పరిశీలించగా షాకింగ్ నిజయం తెలిసింది. పెళ్లి జరిపించిన పురోహితుడే మంగళ సూత్రాన్ని కాజేశాడు. పెళ్లి కూతురు మెడలోంచి కింద పడిన మంగళ సూత్రాన్ని పురోహితుడు మెల్లగా తన జేబులో వేసుకోవడం వీడియోలో రికార్డ్ అయ్యింది. దీంతో పురోహితున్ని సంప్రదించేందుకు ప్రయత్నించగా ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. ఇక లాభం లేదని పెళ్లి వారు పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఈ విషయం తెలిసిన వారంతా పురోహితుడిపై దుమ్మెత్తిపోస్తున్నారు. వివాహం జరిపించిన వాడే ఇలా మంగళసూత్రాలను దొంగిలించడం ఏంటని అంతా వాపోతున్నారు.