నాగర్ కర్నూల్- ఇంట్లో సెల్ ఫోన్ రింగయ్యింది. చాల మంది తెలిసిన వాళ్లున్నా ఎవ్వరు ఫోన్ తీయడం లేదు. ఇక చేసేది లేక ఆ మూడేళ్ల చిన్నారి సెల్ ఫోన్ ను చేతిలోకి తీసుకున్నాడు. మెల్లగా బుడి బుడి అడుగులు వేసుకుంటూ వచ్చి పడుకున్న తల్లి చెవి దగ్గర పెట్టాడు. ఎంతకీ తల్లి లేవకపోయే సరికి మాట్లాడమని మళ్లీ అమ్మ నోటి దగ్గర పెట్టాడు. అయినప్పటికీ తల్లి లేవకపోయే సరికి ఆ చిన్నారి మౌనం వహించాడు. అమ్మ ఎందుకు లేవడం లేదబ్బా అన్న ఆలోచనలో పడ్డాడు.
ఈ దృష్యాన్ని చూసిన వారంతా చలించిపోయారు. ఇక మీ అమ్మ ఎప్పటికీ లేవదని ఆ చిన్నారికి చెప్పినా అర్ధం కాదని బంధువలంతా రోధించారు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగింది. లింగాల మండల కేంద్రానికి చెందిన 26 ఏళ్ల డాక్టర్ దివ్య ఆత్మహత్య చేసుకుంది. సూర్యపేట జిల్లా నేరెడుచర్లకు చెందిన దివ్యకు లింగాలకు చెందిన సోమశేఖర్ తో పెళ్లైంది. ఇద్దరు డాక్టర్లు కావడంతో దుబాయ్ లో ఉద్యోగం చేస్తున్నారు.
రెండు నెలల క్రితం ఇండియాకు వచ్చారు. ఐతే ఈ సారి భార్యా బిడ్డను ఇక్కడే వదిలి, సోమశేఖర్ మాత్రం దుబాయ్ వెళ్లిపోయాడు. మరి ఇద్దరి మధ్య ఏంమనస్పర్ధలు ఉన్నాయో తెలియదు కాని, తన మూడేళ్ల కొడుకును బయటకు పంపి, తపులు వేసుకుని ఫ్యాన్ కు ఉరేసుకుంది దివ్య. కాసేపటికి చిన్నారి తల్లి ఉన్న గది తలుపు తెరుచుకోవడం లేదని ఏడవడంతో, ఆమె అత్తా, మామలు వెళ్లి చూసేసరికి ఆమె ఫ్యాన్ కు వేలాడుతూ ఉంది.
ఆస్పత్రికి తీసుకెళ్తే అప్పటికే దివ్య చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. తల్లి చనిపోయిన విషయం అర్ధం కాని చిన్నారి ఫోన్ రింగవ్వగానే ఆమె శవం దగ్గరకి వెళ్లి మాట్లాడమని చెవిదగ్గర పెట్టిన దృష్యం అందరికి కన్నీరు తెప్పించింది. ఆ చిన్నారికి ఏంచెప్పాలో తెలియక అంతా చలించిపోయారు.