ఫిలిప్పిన్స్- ఈ మధ్య కాలంలో విమాన ప్రమాదాలు పెరిగిపోయాయి. సాంకేతిక లోపం వల్ల విమానాలు కూలిపోతున్నాయి. ప్రపంచం వ్యాప్తంగా ఎక్కడో ఓ చోట విమాన ప్రమాద ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఫిలిప్పీన్స్లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. మొత్తం 85 మంది సైనికులతో వెళ్తున్న ఎయిర్ ఫోర్స్ కు చెందిన సీ-130 విమానం జోలో ద్వీపం వద్ద కుప్పకూలింది.
వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది 40 మందిని కాపాడినట్లు ఆ దేశ సాయుధ దళాల చీఫ్ సిరిలిటో సోబెజన తెలిపారు. మిగతా జవాన్ల కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. విమాన ప్రమాదంలో గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సులు ప్రావిన్స్లోని పాటికుల్ అనే పర్వత పట్టణంలోని బంగ్ కాల్ విలేజ్లో ఎయిర్ ఫోర్స్ విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సోబెజన తెలిపారు.
విమానం రన్ వేను మిస్ కావడం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. విమానం కూలగానే పెద్ద శబ్దం వచ్చినట్లు స్థానికులు చెప్పారు. ఆ వెంటనే కాసేపటికి విమానం నుంచి మంటలు వచ్చినట్లు వారు తెలిపారు. సహాక చర్యల్లో స్థానికులు కూడా పాలుపంచుకోవడంతో కొంత ప్రాణ నష్టం తగ్గినట్లు సమాచారం. ఇక ఈ విమాన ప్రమాదంపై ఫిలిప్పిన్స్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.