క్రైం డెస్క్- నటుడు, సినిమా విశ్లేషకుడు కత్తి మహష్ కారు ప్రమాదం, ఆయన మృతి పట్ల తండ్రి ఓబులేషు తో పాటు చాలా మంది అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కత్తి మహేశ్ మృతిపై విచారణకు ఆదేశించింది. ఇందులో భాగంగా ఏపీ పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ మేరకు ప్రమాదం జరిగిన రోజు కత్తి మహేశ్ తో పాటు కారులో ఉన్న సురేష్ ను పోలీసులు విచారించారు.
కారు ప్రమాదం జరిగినప్పుడు సురేష్ సైతం కారులోనే ఉన్నా చిన్న చిన్న గాయలు మాత్రమే కావడం వెనుక రహస్యం ఏంటన్న కోణంలో పోలీసులు విచారించారు. ఐతే పోలీసుల విచారణలో సురేష్ చాలా విషయాలను బయటపెట్టాడు. అందరు అనుకుంటున్నట్లు సురేష్ డ్రైవర్ కాదు. కత్తి మహశ్ బిజినెస్ పార్టనర్. వీరిద్దరు కలిసి మైనింగ్ బిజినెస్ చేయాలని అనుకున్నారు. చిత్తూరు జిల్లా యర్రావారి పాలెం మండలంలోని ఉదయమాణిక్యం గ్రామంలో మైనింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు.
మొత్తం 25 ఎకరాల్లో చెరో 12.5 ఎకరాల్లో మైనింగ్ చేయడానికి ప్రణాళికలు సిద్దం చేసుకున్నారు. ఇక మైనింగ్ కు సంబందించి ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సి ఉంది. ప్రమాదం జరిగిన రోజు మైనింగ్ కు సంబందించిన ఎన్ ఓసీ కోసం ఎమ్మార్వో కార్యాలయానికి బయలుదేరారు కత్తి మహేశ్, సురేష్. ఎన్ఓసీ రావాలంటే గ్రామసభ పెట్టాలని, ఆ గ్రామ సభ కోసం ఎంపీడీవో పిలిస్తే ఆ రాత్రి కారులో బయలుదేరామని సురేష్ పోలీసులు విచారణలో చెప్పాడు. ఇక కారు ప్రమాదం జరిగిన సమయంలో సురేష్ డ్రైవింగ్ చేస్తున్నాడట.
తాను సీటు బెల్ట్ పెట్టుకుని ఉండటంతో తనకు పెద్దగా గాయాలు కాలేదని చెప్పుకొచ్చాడు. ఇక కత్తి మహేశ్ ను సీటు బెల్ట్ పెట్టుకోవాలని కోరినా.. అతను మాత్రం సీటు బెల్ట్ పెట్టుకోలేదని సురేష్ తెలిపాడు. ఇక డ్రైవింగ్ సీటులో ఉన్న వాళ్లకి స్ట్రీరింగ్ మీద ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుందని, పైన మరొకటి ఉంటుందని చెప్పారు. ఈ రెండు ఆ టైంలో తెరుచుకోవడంతో తాను ప్రమాదం నుంచి బయటపడ్డానని చెప్పుకొచ్చాడు సురేష్. ఐతే కత్తి మహేశ్ కూర్చున్న వైపు ఒకటే ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అయ్యిందట.