చిత్తూరు- తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో త్రివిద దళాల అధిపతి, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. కోయంబత్తూరులోని కూనూర్ సమీపంలో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలడంతో బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక రావత్ సహా మరో 11 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ చిత్తూరుకు చెందిన సాయితేజ చనిపోయారు.
దీంతో ఆయన స్వస్థలం కురబలకోట మండలం ఎగువరేగడ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. హెలికాప్టర్ ప్రమాద విషయం తెలుసుకున్న సాయితేజ బంధువులు, స్నేహితులు, సన్నిహితులు మదనపల్లెలో భార్య శ్యామల నివాసం ఉంటున్న ఇంటికి, ఎగువరేగడ గ్రామంలో తల్లిదండ్రుల ఇంటికి చేరుకున్నారు. సాయితేజ మరణ వార్త తెలిసి తల్లిదండ్రులు సొమ్మసిల్లి పడిపోయారు. తల్లి భువనేశ్వరిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు.
ప్రమాదం జరిగిన బుధవారం ఉదయమే సాయితేజ ఫోన్ చేసి మాట్లాడినట్లు భార్య శ్యామల ఎడూస్తూనే చెప్పారు. పాప దర్శిని ఏం చేస్తోంది.. మోక్షజ్ఞ స్కూల్కు వెళ్లాడా.. చిట్టితల్లిని చూడాలని ఉంది. వీడియో కాల్ చేస్తా అంటూ భార్య శ్యామలతో సాయితేజ బుధవారం ఉదయం 8.45 గంటలకు మాట్లాడారు. భార్య, పాపను వీడియోకాల్లో చూస్తూ తాను చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్తో కలిసి తమిళనాడు వెళుతున్నానని, వీలు కుదిరితే సాయంత్రం మళ్లీ పోన్ చేస్తానని చెప్పి, భార్యా బిడ్డకు టాటా చెప్పారు సాయితేజ.
ఆ తరువాత కాసేపటికే ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. సాయితేజకు 2016లో శ్యామలతో వివాహం జరిగింది. వీరికి కుమారుడు మోక్షజ్ఞ (5), పాప దర్శిని (2) సంతానం. కుమారుడు మోక్షజ్ఞ చదువు కోసం సాయితేజ భార్య శ్యామల మదనపల్లె ఎస్బీఐ కాలనీ రోడ్ నెం.3లో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. సాయితేజ చివరిగా సెప్టెంబర్లో వినాయక చవితికి స్వస్థలానికి వచ్చి వెళ్లారు.