ఉత్తర్ ప్రదేశ్- అయోధ్య రామాలయ భూ కొనుగోలు అంశం మళ్లీ వివాదం అవుతోంది. రామ జన్మభూమి తీర్ద క్షేత్ర ట్రస్ట్ భూముల కొనుగోలులో అవినీతికి పాల్పడిందంటూ ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. రెండు కోట్ల విలువ చేసే భూమిని 18 కోట్ల 50 లక్షలకు కొన్నారని ఆప్, ఎస్పీ పార్టీ ఎంపీలు ఆరోపించారు. దీంతో వివాదం రాజుకుంది. ఈ భూ వివాదాన్ని చల్లార్చేందుకు రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఓ ప్రకటన చేసింది. రామాలయ నిర్మాణానికి జరుగుతున్న భూమి కొనుగోళ్లలో మోసాలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణలను ఖండించింది. రామాలయ నిర్మాణం కోసం అయోధ్య జిల్లాలోని బాగ్ జైసీ గ్రామంలో రైల్వే స్టేషన్ సమీపంలో కొన్న 12,080 చదరపు మీటర్ల భూమి రోడ్డుకి పక్కనే ఉంటుందని తెలిపింది.
ఇక్కడ త్వరలోనే నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణం జరగనుందని, రామ జన్మభూమి మందిరాన్ని చేరుకోవడానికి ఇదే ప్రధాన మార్గం కానుందని ట్రస్ట్ ప్రటనలో పేర్కొంది. అందుకని ఆ ప్రాంతంలో భూముల ధరలు అధికంగా ఉండటంతో.. చదరపు అడుగుకు 1,423 రూపాయల చొప్పున ఆ భూమిని కొన్నామని తెలిపారు. ఇది మార్కెట్ ధర కన్నా చాలా తక్కువ అని చెప్పుకొచ్చారు. మార్చి 18న ఆ భూమిని కుసుమ్ పాఠక్, హరీశ్ పాఠక్ నుంచి రవి మోహన్ తీవారీ, సుల్తాన్ అన్సారీ అనే ఇద్దరు వ్యక్తులు కొనుగోలు చేశారు. ఇందుకు వారు 2 కోట్ల కన్సిడరేషన్ తో పాటు సర్కిల్ రేట్ వాల్యుయేషన్కు 5.80 కోట్లు, స్టాంపులకు 5.80 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు.
ఆ వెంటనే ఆ భూమిని రవి మోహన్ తివారీ, సుల్తాన్ అన్సారీ నుంచి కొనడానికి 18.5 కోట్ల రూపాయలకు కన్సిడరేషన్ మొత్తానికి రామ జన్మభూమి ట్రస్టు అగ్రిమెంట్ చేసుకుంది. ఈమేరకు అడ్వాన్సుగా 17 కోట్ల రూపాయలు చెల్లించారు. వారితో ఒప్పందం కుదుర్చుకునే విషయంలో ట్రస్టు శరవేగంగా నిర్ణయం తీసుకున్నప్పటికీ, పూర్తి పారదర్శకంగానే వ్యవహరించిందని ప్రకటనలో పేర్కొంది. ఆర్థిక లావాదేవీలన్నీ ఆన్ లైన్ పద్ధతిలోనే జరిగాయని, ఆర్టీజీఎస్ ద్వారా 17 కోట్ల రూపాయలు చెల్లించామని ట్రస్ట్ స్పష్టం చేసింది. మరోవైపు ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.