ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2013లో పట్నాలో పర్యటించిన సందర్భంలో ఆయన ర్యాలీలో బాంబు పేలుళ్లు సంభవించిన విషయం తెలిసిందే. కాగా ఈ కేసును విచారించిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కోర్టు సోమవారం తీర్పును వెలువరించింది. ఈ కేసులో మొత్తం పదిని మందిని విచారించిన కోర్టు తొమ్మిది మందిని దోషులుగా నిర్ధారించగా, వారిలో నలుగురికి ఉరిశిక్ష.. ఇద్దరికి యావజ్జీవిత ఖైదు విధించారు. అలాగే మిగతా ముగ్గురిలో ఇద్దరికి పదేళ్లు, ఇంకొకరికి ఏడేళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది.
సరైన సాక్ష్యాధారాలు లేక పోవడంతో మరో నిందితుడిని నిర్దోషిగా ప్రకటించి విడుదల చేసింది. 2014 సాధారణ ఎన్నికలకు ముందు బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోదీ 2013 అక్టోబర్ 27న పట్నాలోని గాంధీ మైదాన్లో ‘హుంకార్’ పేరుతో భారీ ర్యాలీ నిర్వహించ తలపెట్టారు. ఈ, ర్యాలీ ప్రారంభం కావడానికి ముందే సభా ప్రాంగణం వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోగా… దాదాపు 90 మంది గాయపడ్డారు.