న్యూ ఢిల్లీ- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ భారీ షాక్ ఇచ్చింది. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో పలు ఉల్లంఘనలకు గాను ఏపీ సర్కార్ కు కోట్ల రూపాయల జరిమాన విధించింది ఎన్జీటీ. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో పర్యావరణ అనుమతులు ఉల్లంఘించారంటూ జాతీయ హరిత ట్రైబ్యునల్ జగన్ ప్రభుత్వానికి భారీ జరిమానా వేసింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం సాగునీటి ప్రాజెక్టుకు సంబందించిన పర్యావరణ అనుమతులు ఉల్లంఘనకు గాను రాష్ట్ర ప్రభుత్వానికి ఏకంగా 120 కోట్ల జరిమానా విధించింది. అంతే కాదు రాష్ట్రంలో పర్యావరణ అనుమతులు లేకుండా కట్టిన మరో 3 ప్రాజెక్టులకు కూడా నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ భారీ మొత్తంలో జరిమానా విధించింది. పురుషోత్తపట్నం ప్రాజెక్టుకు సంబంధించి 24.56 కోట్లు, పట్టిసీమ ప్రాజెక్టుకు సంబంధించి 24.90 కోట్లు, చింతలపూడి ప్రాజెక్టుకు సంబంధించి 73.60 కోట్ల రూపాయల జరిమానా విధించింది ఎన్జీటీ.
పోలవరం ప్రాజెక్టు సహా మొత్తం నాలుగు సాగునీటి ప్రాజెక్టుల ఉల్లంఘటనకు జగన్ సర్కార్ కు మొత్తం 243.06 కోట్ల జరిమానా విధించింది. ఇక ఈ జరిమానాకు సంబందించిన డబ్బును 3 నెలల్లో చెల్లించాలని జగన్ ప్రభుత్వాన్ని జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలికి ఈ జరిమానా డబ్బు చెల్లించాలని తన ఆదేశాల్లో పేర్కొంది. జరిమానా నిధుల వినియోగంపై ఏపీ పీసీబీ, సీపీసీబీ సభ్యులతో కమిటీ నియమించాలని ఎన్జీటీ స్పష్టం చేసింది.
ఏపీలో నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టుల విషయంలో పర్యావరణ అనుమతల ఉల్లంఘనలపై గతంలో ఎన్జీటీకి చాలా ఫిర్యాదులు వచ్చాయి. సామాజిక విశ్లేషకుడు పెంటపాటి పుల్లారావు, మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ కు ఫిర్యాదులు చేశారు. ఈ ఫిర్యాదులను విచారించిన హరిత గ్రీన్ ట్రిబ్యునల్, ఏపీ ప్రభుత్వానికి 243.06 కోట్ల రూపాయల భారీ జరిమానాను విధించింది.