చదువుకోవాలన్నలక్ష్యం ముందు అవరోధాలన్నీ అడ్డంకులు కాదని నిరూపించిందో మహిళ. నిండు గర్బిణీ, ప్రసవ వేదన.. తదుపరి పరీక్ష రాయాలన్న సంకల్పాన్ని ఏమీ చేయలేకపోయాయి.
అనుకుంటే సాధించలేనిదీ ఏదీ లేదు. గట్టి సంకల్పం ఉంటే కొండనైనా పిండి చేయవచ్చు అంటారు పెద్దలు. అయితే కొన్ని సార్లు ఆ సంకల్పానికి అనివార్య కారణాలు, సాకులు అవరోధాలుగా మారతాయి. ఏ పరిస్థితులోనైనా అవరోధాలను అధిగమించగలిగితే విజయం ఇంటి తలుపు తడుతుంది. ఆ విషయాన్ని నిరూపించిందీ బీహార్కు చెందిన మహిళ. చదువుకోవాలన్న పట్టుదలే ఆమెను పురిటి నొప్పులను కూడా లెక్క చేయనివ్వలేదు. అదే ఆమెను పరీక్ష రాసేలా చేసింది. పలువురికీ స్ఫూర్తి దాయకంగా నిలిచింది.
వివరాల్లోకి వెళితే బీహార్లోని బంకా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో రుక్మిణీ కుమారీ (22) అనే మహిళ పదో తరగతి చదువుతుంది. ఆమె నిండు గర్భిణీ. అంతలో రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 14న మొదటి పరీక్ష రాసి ఇంటికి రాగా, ఆమెకు నొప్పులు మొదలయ్యాయి. వెంటనే ఆసుప్రతికి తరలించగా.. రాత్రంతా నొప్పులు పడ్డ మహిళ 15వ తేదీన ఉదయం మగ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆ రోజు కూడా ఆమెకు పరీక్ష ఉంది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యలకు చెప్పగా.. తొలుత నిరాకరించారు. తర్వాత వైద్యల సాయంతో సైన్సు పేపర్ రాసి వచ్చింది.
ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ.. మంగళవారం గణితం పేపర్ రాసే సమయానికి కొంత అసౌకర్యం కలిగిందని, మరుసటి రోజు జరగాల్సిన సైన్స్ పేపర్పై రాస్తానో లేదోనని ఆందోళన చెందానని అన్నారు. అయితే పురిటి నొప్పుల కారణంగా కొంత ఆలస్యంగా ఆసుప్రతికి వెళ్లనప్పటికీ.. ప్రసవం అయ్యాక పరీక్ష రాయాలని భావించానని తెలిపారు. ఆసుప్రతి సిబ్బంది అంబులెన్స్, వైద్యులను వెంట పంపగా.. పరీక్ష బాగా రాశానని, మంచి మార్కులు వస్తాయని ఆనందం వ్యక్తం చేసింది. మహిళల విద్యపై రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న ప్రాధాన్యత ప్రతిధ్వనిస్తోందని అనేందుకు ఈ సంఘటన రుజువు చేస్తుందని, షెడ్యూల్డ్ కులాలకు చెందిన రుక్మిణి అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారని జిల్లా విద్యాశాఖాధికారి పవన్కుమార్ కొనియాడారు.
‘ప్రసవ సమయంలో ఆమె ఆరోగ్యం కొంత దెబ్బతినడంతో పాటు నీరస పడిపోవడంతో ఈ పరీక్ష రాయోద్దని ఆమెకు సూచించాము. కానీ ఆమె పరీక్ష రాస్తానని మొండిగా చెప్పింది. ఈ అత్యవసర పరిస్థితుల్లో ఆమెకు సహాయం చేయడానికి అంబులెన్స్ మరియు కొంతమంది పారామెడిక్స్ను నియమించాం’ అని ఆసుపత్రిలో మహిళకు చికిత్స అందించిన వైద్యుడు భోళా నాథ్ తెలిపారు. తల్లీ కొడుకులిద్దరూ క్షేమంగా ఉన్నారని, రుక్మిణి చదువుకోవాలన్న పట్టుదల చూసి తమకు ముచ్చట వేసిందని డాక్టర్ భోళానాథ్ తెలిపారు. ప్రసవ వేదనను అనుభవిస్తూనే పరీక్ష రాయాలన్న ఆమె సంకల్పానికి శభాష్ అని మెచ్చుకోవలసిందే. బిడ్డ పుట్టిన కొన్ని గంటలకే పరీక్ష రాసిన ఈ మగువ ఘటనపై అభిప్రాయాలను మీ కామెంట్ల రూపంలో తెలియజేయండి.