అమ్మ.. ఆ పిలుపు కోసం పరితపించని స్త్రీ మూర్తి ఉండదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రతి స్త్రీ తల్లి అవ్వాలనే కోరుకుంటుంది. గర్భం దాల్చిన దగ్గరి నుంచి ప్రసవం జరిగేదాకా.. తన చిన్నారిని అల్లారు ముద్దుగా పెంచుకుంటూ.. తన బిడ్డలోనే తన లోకాన్ని చూసుకుంటుంది. కానీ, ఇప్పుడు చెప్పుకోబోయే మహిళ మాత్రం అలాంటి వాటికి నోచుకోలేకపోతోందని చెప్పాలి. నిజానికి ఆమెలాంటి పరిస్థితి మరెవరికీ రాకూడదని గట్టిగా కోరుకోవాలి. ఎందుకంటే తనకు ప్రసవం జరిగింది అని కూడా తనకి తెలియదు. తనకు పుట్టిన చిన్నారి ఎలా ఉందో కూడా తాను చూసుకోలేదు. తన మొదటి ఏడుపుని వినలేదు. అసలు ఆమెకు అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో చూద్దాం.
వివరాల్లోకి వెళ్తే.. 7 నెలలుగా కోమాలో ఉన్న గర్భిణీ(23)కి ఢిల్లీ ఎయిమ్స్ లోని వైద్యలు గతవారం ప్రసవం చేశారు. ఆమె ఇప్పటికీ అచేతన స్థితిలోని ఉన్నట్లు వెల్లడించారు. ఆమెకు పండంటి ఆడశిశువు జన్మించినట్లు తెలిపారు. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి విషయానికి వస్తే.. ప్రస్తుతం స్వతహాగానే గాలి తీసుకుంటున్నట్లు తెలిపారు. అయితే ఆమె సాధారణ స్థితికి వచ్చేందుకు 10 నుంచి 15 శాతం అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే అందుకు కొన్ని ఏళ్లు సమయం పడుతుందని తెలిపారు.
అసలు ఆమెకు ఈ స్థితి ఎందుకు వచ్చిందంటే.. ఈ ఏడాది మార్చి 31న గర్భిణీ తన భర్తతో కలిసి బైక్ పై వెళ్తోంది. అప్పుడు వారు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఇద్దరూ ఆ సమయంలో హెల్మెట్ ధరించలేదు. గర్భిణీ తలకు బలమైన గాయం అయ్యింది. భర్తకు పెద్దగా గాయాలు కాలేదు. ఆమెకు మొదట స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందించారు. అయితే ఏప్రిల్ 1న ఢిల్లీ ఎయిమ్స్ కు తరలించారు. ప్రస్తుతం ఆమె ఎయిమ్స్ ట్రామా కేర్ యూనిట్ లో చికిత్స పొందుతోంది. మెదడులో ఎముక ఉండిపోవడం వల్లే ఆమె కోమాలోకి వెళ్లినట్లు తెలిపారు. అయితే ఆమెకు ఇప్పటికే 5 న్యూరో సర్జరీలు చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆమె 40 రోజుల గర్భిణీ అని వెల్లడించారు. ఆ సమయంలో కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉందని తెలియడంతో కుటుంబసభ్యులు అబార్షన్ కు ఒప్పుకోలేదు. శిశువు 2.5 కిలోల బరువుతో ఆరోగ్యంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఆమె కోమాలో ఉన్న కారణంగా బిడ్డకు పాలిచ్చే ఆస్కారం లేదని తెలిపారు.
Woman unconscious for 7 months gives birth to baby girl at AIIMS, Delhi
Read @ANI Story | https://t.co/jTZIfRJKlV#Delhi #health pic.twitter.com/nlO0Gx5xCk
— ANI Digital (@ani_digital) October 29, 2022