సాధారణంగా ఏ పదవి అయినా సంపూర్ణంగా కొనసాగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే కొంత మంది మాత్రం అనూహ్య నిర్ణయాలతో ముందుగానే తమ పదవులకు రాజీనామా చేస్తూ షాక్ ఇస్తుంటారు. అది వారి వ్యక్తిగత కారణాలు కావొచ్చు.. పార్టీ ఆదేశాలు కావొచ్చు. తాజాగా ఉత్తరాఖండ్ గవర్నర్ పదవికి బేబీ రాణి మౌర్య రాజీనామా చేశారు. ట్విస్ట్ ఏంటేంటే.. ఇంకా రెండేళ్ల పదవీ కాలం మిగిలి ఉండగానే ఈ నిర్ణయం తీసుకున్నారు.
రాజీనామా లేఖను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు పంపారు. 2018 ఆగస్టు 26న ఆమె ఉత్తరాఖండ్ గవర్నర్ గా బాధ్యతలను స్వీకరించారు. అప్పటి గవర్నర్ కృష్ణకాంత్ పాల్ పదవీకాలం ముగియడంతో బేబీ రాణిని కేంద్ర ప్రభుత్వం గవర్నర్ గా నియమించింది. గవర్నర్ కార్యదర్శి బ్రిజేష్ కుమార్ సంత్ ఈ విషయాన్ని కన్ఫాం చేశారు. ఉత్తరప్రదేశ్కు చెందిన బేబీ రాణి మౌర్య.. ఉత్తరాఖండ్ గవర్నర్ కావడానికి ముందు అనేక రాజకీయ, పరిపాలనా పదవులలో పనిచేశారు.
1995 నుండి 2000 వరకు ఆగ్రా మేయర్గా ఉన్నారు. 2001లో యూపీ రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు సభ్యురాలుగా, 2002లో జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలుగా పని చేశారు. ఇక 1996లో ఆమెకు సమాజ్ రత్న, 1997లో ఉత్తర ప్రదేశ్ రత్న, 1998లో నారి రత్న అవార్డులు లభించాయి. గత నెలలో గవర్నర్ గా ఆమె మూడేళ్ల కాలాన్ని పూర్తి చేసుకున్నారు.