ప్రపంచంలో టీ అంటే ఇష్టపడిని వారు ఉండరు. ఉదయం లేచిన మొదలు రాత్రి పడుకునే వరకు కొంత మందికి టీ జీవితంలో ఒక భాగం అనే చెప్పొచ్చు. టెన్షన్, తల నొప్పి, అలసట ఉన్నవారు టీ తాగడం వల్ల ఉపశమనం పొందవచ్చు. టీ గుండెవ్యాధులు, క్యాన్సర్ వంటివి రాకుండా నిరోధిస్తుందని అంటుంటారు. అలాంటిది ఓ ఇంట టీ తాగి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. ఈ విషాద ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
యూపీలోని మెయిన్పురిలో చెందిన శివానంద్ భార్య ఉదయం రోజూలాగే టీ పెట్టి వారి కుటుంబ సభ్యులకు ఇచ్చింది. టీ తాగిన కొద్ది సేపటి తర్వాత వాంతులు, కడుపులో తిప్పినట్లు కావడంతో శివానంద్ అతని కుమారులు శివంగ్, దివ్యాన్ష్, మామ రవీంద్ర సింగ్ పక్కింటి వ్యక్తి సోబ్రాన్ సొమ్మసిల్లిపడిపోయారు. వెంటనే వారిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రవీంద్ర సింగ్, శివంగ్, దివ్యాన్ష్ మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. శివానంద్, సోబ్రాన్ ని పరిస్థితి పూర్తిగా విషమించడంతో వారిని వెంటనే సైఫాయి హాస్పిటల్ కి తరలించారు.. చికిత్స పొందుతూ ఆ ఇద్దరూ మరణించారు.
ఈ దారుణ ఘటనపై పోలీసులు విచారణ జరిపారు. శివానంద్ భార్య టీ కాస్తున్న సమయంలో పురుగు మందును టీ పొడి అనుకొని పెట్టడంతో అది సేవించిన ఐదుగురు ప్రాణాలు విచినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. అది అత్యంత విషపూరితమైన పిచికారీ మందు కావడంతో ఐదుగురిపై వెంటనే ప్రభావం చూపించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు ఎస్పి కమలేష్ దీక్షిత్ తెలిపారు. ఒకేసారి ఐదుగురు చనిపోవడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.