పెళ్లిలో గులాబ్ జామూన్ల కోసం జరిగిన గొడవ ఓ నిండు ప్రాణం తీసింది. ఓ వ్యక్తి పెళ్లి చూడటానికి వచ్చిన ఓ యువకుడ్ని కత్తితో పొడిచి చంపాడు. ఈ దారుణ సంఘటన ఉత్తర ప్రదేశ్లో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తర ప్రదేశ్, మొహల్లా షేక్ గ్రామానికి చెందిన ఉస్మాన్ కూతురుకు అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడితో పెళ్లి కుదిరింది. గురువారం ఎత్మాద్పూర్లో పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు పెద్ద సంఖ్యలో బంధు మిత్రులు, స్నేహితులు హాజరయ్యారు.
పెళ్లి అయిపోయిన తర్వాత భోజనాలు మొదలయ్యాయి. ఈ భోజనాల విషయంలో పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు తరపు వాళ్ల మధ్య గొడవ జరిగింది. భోజనంలో గులాబ్ జామూన్లు లేవని ఓ వర్గం మరో వర్గం వారితో గొడవ పెట్టుకుంది. గొడవ గాలివానలా పెద్దదైంది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ వ్యక్తి కత్తి తీసుకుని గొడవ దగ్గరకు వచ్చాడు. పెళ్లి చూడటానికి వచ్చిన అతిధులపై విచక్షణా రహితంగా కత్తితో దాడి చేయటం మొదలుపెట్టాడు.
దీంతో సన్నీ అనే 22 ఏళ్ల యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడివారు అతడ్ని హుటాహుటిన దగ్గరలోని కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు. సన్నీ పరిస్థితి మరింత సీరియస్గా ఉండటంతో అక్కడినుంచి సరోజినీ నాయుడు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ సన్నీ మృత్యువాత పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకున్నారు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.