కొన్ని కొన్ని సార్లు జరిగే చిన్న చిన్న పొరపాట్ల వలన పెద్ద పెద్ద ప్రమాదాలు జరుగుతుంటాయి. అయితే పదాలను సరిగ్గా వినకపోయినా, అర్ధం చేసుకోవడంలో పొరపడిన కూడా అనుకోని పరిణామాలకు దారితీస్తాయి. తాజాగా కొందరు సిబ్బంది చేసిన పొరపాటు భోపాల్ విమానాశ్రయ అధికారులకు ముచ్చెమటలు పట్టించింది. బాంబు భయంతో సైరన్లు మోగించి, అత్యవసర స్థితిని విమానాశ్రయంలో ప్రకటించారు. అసలు ఏం జరిగింది? ఆ సిబ్బంది చేసిన పొరపాటు ఏమిటి? ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..
మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ లోని రాజ భోజ్ విమానాశ్రయంలో గురువారం ఇండిగో టికెట్ కౌంటర్ కి ఓ కాల్ వచ్చింది. అవతలి వ్యక్తి ఆగ్రాకు వెళ్లే విమానంలో ‘బల్లాస్ట్’ గురించి ఆరా తీశాడు. ఫోన్ లో మాట్లాడిన యువతి ఆ బల్లాస్ట్ పదాన్ని బ్లాస్ట్(పేలుడు)గా అర్ధం చేసుకుంది. దీంతో విమానాశ్రయంలో బ్లాస్ట్ జరగబోతుందేమో అని యువతి తనకు తాను ఊహించుకుంది. దీంతో వెంటనే ఆ యువతి బాంబు బెదిరింపులు వచ్చాయంటూ విషయాన్ని అధికారులకు తెలియజేసింది. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు ఎయిర్ పోర్ట్ లో సైరన్ మోగించారు. నిపుణులను సంప్రదించగా. వారు ఫోన్ కాల్ వాయిస్ ను విశ్లేషించారు. చివరికి అది కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ గా గుర్తించారు.
బాంబు కలకలం అనేది తప్పుడు సమాచారంగా గుర్తించారు. విమానంలో తగినంత మంది ప్రయాణికులు లేనప్పుడు గాల్లో బ్యాలెన్స్ కోసం ఆ విమానానికి బరువు జోడించడాన్ని ఎయిర్ లైన్స్ సంస్థలు బల్లాస్ట్ అని పిలుస్తుంటాయి. ఆకాల్ లిఫ్ట్ చేసిన యువతి.. కొత్తగా ఉద్యోగంలో చేరారింది. అందుకే ఆ రెండు పదాల మధ్య వ్యత్యాసం గుర్తించలేక పొరబడ్డారని అధికారులు వెల్లడించారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.