దొంగలు చోరీలు చేయడంలో చాలా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంటారు. చోరీలు చేయడంలో వారు చాలా ఆరితేరి ఉంటారు. సాధారణంగా ఇళ్లు, దుకాణాలు వంటి ఇతర ప్రాంతాలను టార్గెట్ గా చేసుకుని చోరీలకు పాల్పడే దొంగలను అనేకమందిని చూశాం. కొందరు దొంగలు విచిత్రమైన దొంగతనాలు చేస్తుంటారు. ఆ దొంగల తెలివి చూస్తే..వామ్మో! వీళ్లెక్కడి దొంగలురా నాయనా.. అని అనకుండా ఉండలేము. ఇటీవలే బ్రిడ్జిని ఎత్తుకెళ్లిన దొంగలు గురించి విని అందరూ అవాక్కయ్యారు. అలాంటి షాకింగ్ న్యూస్ మరొకటి జరిగింది. ఈసారి ఏకంగా రైల్ ఇంజిన్ నే చోరి చేశారు. ఈ దొంగతనం చేసిన విధానం తెలుసుకున్న పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ ఘటన బీహర్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
బీహార్ లోని బెగుసరాయ్ జిల్లా బరౌని ప్రాంతంలోని గర్హరా రైల్వే స్టేషన్ లోని యార్డ్ లో మరమ్మతుల కోసం ఓ రైల్ ఇంజిన్ ను తీసుకొచ్చి ఉంచారు. దీనిపై కొందరు దొంగలు కన్నుపడింది. దీంతో ఆ రైలు ఇంజిన్ ను చోరీ చేసేందుకు ముందుగా బయట నుంచి యార్డు లోకి ఓ సొరంగాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇక ఆ రైలు ఇంజిన్ ను ముక్కలుగా చేసి ఎత్తుకు వెళ్లారు. వారం రోజుల్లోనే ఈ ఇంజిన్ మొత్తాన్ని యార్డ్ నుంచి మాయం చేశారు. బస్తాలతో ఇంజిన్ లోని రాగితీగలు, అల్యూమినియం ప్లేట్ లను చోరి చేసి..వివిధ ప్రాంతాల్లో స్క్రాప్ దుకాణాల్లో అమ్మేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు, రైల్వే స్పెషల్ విజిలెన్స్ బృందం నవంబర్ 18న గర్హరా లోని పలు ప్రాంతంలో ఉండే స్క్రాప్ దుకాణాలపై దాడులు చేశారు.
ఈ దాడులు రైలు ఇంజిన్ కి సంబంధించిన కొన్ని భాగాలు దొరికాయి. ఆ దుకాణదారులను విచారించగా అసలు విషయం బయటపడింది. దొంగల ముఠా నాయకుడు చందన్ కుమార్ తో పాటు మరో ఇద్దరు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. వారిని తమదైన శైలిలో విచారించగా ముజఫర్ జిల్లాలోని ఓ గోడౌన్లో దాచిపెట్టిన సుమారు రూ.30 లక్షల విలువ చేసే రైలు ఇంజిన్ సామాగ్రిని, వివిధ భాగాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే పోలీసులు దాడులు విషయం తెలిసి.. కొందరు దొంగలు తప్పించుకున్నారు. పోలీసులు దర్యాప్తులో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ముఠాలతో పాటు మరికొంత మంది ఈ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఈఘటనపై రైల్వే అధికారులు స్పందించారు.
” రైల్ ఇంజిన్ చోరీ వంటి సంఘటన ఏదీ జరగలేదు. ఇది కేవలం అసత్య వార్త మాత్రమే. బరౌని స్టేషన్ సమీపంలో ఒక స్పేర్ రైల్ ఇంజిన్ ఉంచితే.. అందులోకి ప్రవేశించిన దొంగలు కొన్ని కేబుళ్లను అపహరించారు. అంతే తప్ప ఇంజిన్ ఎవరు చోరీ చేయలేదు. ఈ కేసు విషయంలో పది రోజుల క్రితం కొందరిని అరెస్టు చేశారు. స్టేషన్ కి సమీపంలో కొంత మట్టి తొలగించడం వల్ల కేవలం చిన్న గొయ్యి వంటి మార్గం ఏర్పడింది. ఎటువంటి సొరంగ మార్గం లేదు” అని రైల్వే అధికారులు వెల్లడించారు. గతంలోనూ బీహార్ లోని ఓ ప్రాంతంలో ఇనుప వంతెన బ్రిడ్జిని దొంగతనం చేశారు. అప్పటి నుంచి ఆ ప్రాంతలో ఓ పోలీసులను కూడా కాపాలాగా ఉంచారు. తాజాగా జరిగిన ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.