మానవ సేవే మాధవ సేవ అని అన్నారు పెద్దలు. మానవ సేవ ఏమో కానీ, కనీస పలకరింపులు కరువైన రోజులివి. మీ ఇంటికి వస్తే ఏమిస్తారు, మా ఇంటికి వస్తే ఏం తెస్తారంటూ లెక్కలు బేరీజు వేసుకుంటున్న కాలం. మానవత్వం పూర్తిగా కరువడింది. సాయం చేసే చేతులు తగ్గిపోయాయి. బతికుండగానే కాదూ చనిపోయిన కడచూపు కోసం అయిన వారే రావడం లేదు. ఇక అనాథ శవాలను పట్టించుకునేదెవరూ.. కానీ అలాంటి వాటికి అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు పంజాబ్కు చెంది పూనమ్ పఠానీ.
లూథియానాకు చెందిన పూనమ్ పఠానీ పంజాబీ కుటుంబంలో జన్మించారు. ఆమెకు 2019లో ఓ ప్రమాదం జరిగింది. ఆ ఘటనలో ఆమె కాలు తీవ్రంగా దెబ్బతింది. మూడు, నాలుగు సర్జరీల తర్వాత ఆమె సరిగా నడవలేకపోయింది. అయినప్పటికీ ధైర్యం కోల్పోకుండా ప్రతి రోజు వ్యాయామం చేసి క్రమంగా నిలబడటం ప్రారంభించారు. అయితే కోవిడ్ సమయంలో తన ఫ్రెండ్ తండ్రి చనిపోగా మృతదేహాన్ని శ్మశానానికి తీసుకెళ్లారు.
అక్కడ పదుల సంఖ్యలో ఉన్నఅనాథ శవాలను చూసి ఆమె చలించిపోయారు. వాటికి దహన సంస్కారాలు చేసేందుకు ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో తన సొంత డబ్బుతో అంత్యక్రియలు చేయించారు. ఇప్పటి వరకు 100 పైగా అనాథ శవాలకు ఆమె అంత్యక్రియలు నిర్వహించేందుకు సాయం అందించారు. ప్రతి నెల 3 నుండి 4 అనాథ శవాల దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారు. ఇలా తన సొంత డబ్బులతో అనాధ శవాలకు అంతిమ వీడ్కోలు పలుకుతున్న పూనమ్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.