ప్రశాంత్ కిశోర్ హస్తం గూటికి చేరనున్నారా..? ఇప్పుడు ఇదే వార్త దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తోంది. పదునైన వ్యూహాలు ప్రత్యర్ధికి చిక్కనివ్వకుండా ఓ ప్రముఖ వ్యూహకర్తగా వెలుగొందుతున్నాడు ప్రశాంత్ కిశోర్. తెర వెనుక ఉండి రాజకీయాల్లోకి కొత్త మార్గాన్ని తీసుకొచ్చాడు. పక్కా ప్రణాళికలతో శత్రువుని దెబ్బకొట్టడంలో ఆయన వ్యూహాలు అంతు చిక్కనివనే చెప్పాలి. ఆయన అడుగుపడితే విజయం తన దరికి చేరాల్సిందే. పార్టీ ఏదైన సరే, ముందున్నది బలమైన ఎవరైనా.. విజయాలు మాత్రం తన వ్యూహాలకు తలవంచాల్సిందే.
ప్రముఖ రాజకీయ వ్యూహకర్తగా పేరు ప్రఖ్యాతలు ముటగట్టుకున్నాడు ప్రశాంత్ కిశోర్. గతంలో అనేక పార్టీల నేతలను సీఎం పీఠాలపై కూర్చుబెట్టిన తెగువ ఆయన సొంతం. 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసి అఖండ విజయాన్ని అందించాడు. అనంతరం ఈ మధ్య కాలంలో పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఎన్నికల్లో సైతం మమతా బెనర్జీ, స్టాలిన్లకు ఎన్నికల వ్యూహకర్త పని చేసి తన సత్తాను మరోసారి చూపించాడు. దీంతో అక్కడ కూడా తన మార్క్ను చెక్కుచెదరకుండా నిలుపుకున్నారు ప్రశాంత్ కిశోర్.
ఇక విషయమేంటంటే..? తాజాగా ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారన్న ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది. ఈ మధ్య కాలంలోనే కాంగ్రెస్ అగ్రనేతలైన రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో పలుమార్లు భేటీ అయ్యాడు ప్రశాంత్ కిశోర్. దీంతో నిజంగానే ప్రశాంత్ కాంగ్రెస్లోకి వెళ్తున్నారంటూ ప్రతిపక్ష పార్టీల నుంచి కూడా వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యలోనే ప్రశాంత్ కిషోర్ పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ ప్రధాన సలహాదారు పదవికి రాజీనామా కూడా చేశారు.
ఇప్పుడు ఇదే అంశం హాట్ టాపిక్ గా మారుతోంది. కాంగ్రెస్ పార్టీలోకి చేరే ఉద్దేశంతోనే ప్రశాంత్ కిషోర్ సలహదారు పదవికి రాజీనామా చేశారని వార్తలు వినిపస్తున్నాయి. ఆయన కాంగ్రెస్లో చేరుతున్నారన్న వాదనకు రాజీనామా చేయటం కూడా కాస్త బలం చేకూర్చినట్లు అవుతోంది. ఇన్ని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న వేళ నిజంగానే ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళతారా అన్నది తేలాల్సి ఉంది.