కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా గర్భిణి స్త్రీలకు రూ. 6 వేలు ఆర్థిక సాయంగా అందిస్తుంది. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండడం కోసం తల్లి మంచి ఆహారం తీసుకోవాలని వారికి ఆర్థిక సహాయం అందించేందుకు కృషి చేస్తుంది.
పేద ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. అందులో భాగంగానే మహిళలకు కూడా ఆర్థిక సాయంగా అందిస్తున్నారు. మహిళా సాధికారత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది. దీనిలో భాగంగా ప్రధాన మంత్రి మాతృత్వ వందన యోజన పథకం(PMMVY) అమలు పరుస్తున్నారు. గర్భిణి మహిళలకు రూ. 6వేలు అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఈ డబ్బులు నేరుగా మహిళల అకౌంట్లోకి పంపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లలను దృష్టిలో ఉంచుకుని గర్భిణి స్త్రీల కొరకు మాతృత్వ వందన యోజన పథకం చేపట్టింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం..
ప్రసవానికి ముందు, తర్వాత స్త్రీలు తమ ఆరోగ్యం పట్ల, పుట్టబోయే బిడ్డ పట్ల కేర్ తీసుకుని రోగ నిరోధక శక్తి పెంచుకునేందుకు కేంద్రం ఆర్థిక సాయం అందిస్తుంది. ఈ పథకం ద్వారా గర్భిణి మహిళలకు రూ.6000 ఇస్తోంది. తొలి కాన్పులో ఆడ లేదా మగ బిడ్డ పుట్టినప్పటికీ మూడు దశల్లో రూ. 5వేలు చెల్లిస్తోంది. మహిళ గర్భవతి కాగానే ఆన్లైన్లో నమోదుకాగానే రూ.1,000, ఆరునెలల తర్వాత రూ.2,000, ప్రసవం జరిగిన 14 వారాల్లో ఇమ్యునైజేషన్ సైకిల్ పూర్తయ్యాక రూ.2,000 అందిస్తారు. ప్రసవం ప్రభుత్వ ఆస్పత్రిలో చేయించుకుంటే రూ. 1000 చెల్లిస్తారు. రెండో కాన్పులో అమ్మాయి పుడితే మాత్రమే తల్లికి రూ. 6వేలు అందజేస్తారు. రెండో కాన్పులో కవలలు పుట్టినా ఒక ఆడపిల్ల పుట్టినా కూడా ఈ పథకం వర్తిస్తుంది. అయితే ఈ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు కొన్ని షరతులున్నాయి.
గర్భిణీ స్త్రీల వయస్సు 19 సంవత్సరాలకంటే తక్కువ ఉండకూడదు. మిగతా వివరాల కొరకు వెబ్ సైట్ wcd.nic.in/schemes/pradhan-mantri-matru-vandana-yojanaని సందర్శించవచ్చు. గర్భవతి స్త్రీలు మూడవ నెలలో ఆరోగ్య కార్యకర్తల వద్ద తమ పేరు నమోదు చేసుకోవాలి. వివరాల కోసం అంగన్వాడీలో లేదా హెల్ప్లైన్ నంబర్ 7998799804 కు కాల్ చేయవచ్చు. తల్లిదండ్రుల ఆధార్ కార్డ్, తల్లిదండ్ుల గుర్తింపు కార్డు, పిల్లల బర్త్ సర్టిఫికేట్, బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ తప్పనిసరి కలిగి ఉండాలి. దేశవ్యాప్తంగా ఉన్న గర్భిణీ మహిళలు ఈ పథకాన్ని పొందవచ్చు.