కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వాలు ఫేస్ మాస్క్, శానిటైజర్, భౌతికదూరం వంటి వాటిని తప్పనిసరి చేశాయి. అయితే.. వీటిని కొందరు పాటించడకుండానే రోడ్లపై తిరుగుతున్నారు. సాధారణంగా మాస్కులు ధరించకుండా బయటకు వస్తే.. ఆయా రాష్ట్రాల్లోని నిబంధనలను బట్టి రూ.1000 జరిమానా లేదా మూడు లేదా ఆరు నెలల జైలు శిక్ష వంటివి విధిస్తున్నారు. అయితే కొందరు పోలీసులు ఇలాంటి వారిలో బుద్ది రావాలని రకరకాల శిక్షలను వేస్తున్నారు. కుప్పిగంతులు వేయించడం, గుంజీలు తీయించడం వంటి సంఘటనలు మనం చూశాం. అయితే ఉత్తరప్రదేశ్ పోలీసులు ఓ వ్యక్తి పట్ల అమానుషంగా వ్యవహారించారు. అతడి చేతికి, కాలికి మేకులు దించారు. ఈ ఘటన బరాదరీ ప్రాంతంలో జరిగింది.
మాస్కు ధరించలేదని ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు ఓ వ్యక్తి పట్ల అమానుషంగా వ్యవహరించారు. అతడి చేతికి, కాలికి మేకులు దించారు. ఈ ఘటన బరేలీలోని బరాదరీ ప్రాంతంలో జరిగింది. బాధితుడి తల్లి పోలీసు అధికారులను ఆశ్రయించడంతో ఇది వెలుగులోకి వచ్చింది. మే 24 రాత్రి 10 గంటల ప్రాంతంలో తనతోపాటు తన కుమారుడు ఇంటి ముందు కూర్చున్నామని, అంతలో ముగ్గురు స్థానిక పోలీసులు అక్కడకు వచ్చినట్లు ఆమె అధికారులకు తెలిపారు. మాస్కులు ఎందుకు ధరించలేదని ప్రశ్నించి, తన కుమారుడితో దురుసుగా వ్యవహరించారని పేర్కొన్నారు. అంతలో వాగ్వాదం జరగడంతో తన కుమారుడిని వారు తీసుకెళ్లిపోయినట్లు వివరించారు. స్థానిక పోలీసు పోస్టు వద్దకు వెళ్లి వారిని అడిగితే తన కుమారుడిని అరెస్టు చేస్తామని బెదిరించారని ఆమె ఆరోపించారు. ఈ వ్యవహారంలో సీనియర్ ఎస్పీ రోహిత్ సజ్వాన్ మీడియాతో మాట్లాడుతూ సదరు వ్యక్తిపై పలు పోలీసుస్టేషన్లలో కేసులున్నాయని తెలిపారు. ఆ కేసుల నుంచి తప్పించుకోవడానికే వారు ఈవిధమైన ఆరోపణలు చేస్తున్నట్లు వెల్లడించారు. వారి ఆరోపణలన్నీ నిరాధారమైనవని తెలిపారు.