ప్రేమ పేరుతో పాకిస్తాన్ నుంచి భారత్ లోకి అక్రమంగా ప్రవేశించి పాక్ ఏజెంట్ గా ఆరోపణలు ఎదుర్కొంటున్న సీమా హైదర్ ను కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారిస్తున్నాయి. ఈ క్రమంలో సీమా హైదర్ ఆమె భర్త సచిన్ మీనా ఈ రోజు ఉదయం అస్వస్థతకు గురయ్యారు.
పబ్జీ గేమ్ ద్వారా పరిచయమై, ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి ప్రియుడి కోసం నలుగురు పిల్లలతో పాటు అక్రమంగా ఇండియాలోకి చొరబడ్డ పాకిస్తాన్ మహిళ సీమా హైదర్ విషయంలో సినిమాను తలపించే ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. యూపీకి చెందిన సచిన్ మీనా కోసం కరాచీకి చెందిన సీమా హైదర్ సరిహద్దు దళాల కళ్లు గప్పి భారత్ లోకి ప్రవేశించడంపై ఇండియా ఇంటెలిజెన్స్ వర్గాలు ఆమెపై అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఆమె పాక్ ఏజెంట్ అని, ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయన్న ఊహాగానాల నేపథ్యంలో యూపీ యాంటి టెర్రిరస్ట్ స్క్వాడ్, ఇంటెలిజెన్స్ బ్యూరోలు దర్యాప్తు సాగిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ ప్రేమజంట అస్వస్థతకు గురయ్యారు. ఆ తర్వాత ఏం జరిగింది? అనే విషయాలు మీకోసం..
పాకిస్తాన్ నుంచి నేపాల్ ద్వారా అక్రమంగా ఇండియాకు వచ్చిన సీమాకు పాక్ ఐఎస్ఐతో సంబంధాలున్నాయనే అనుమానంతో కేంద్ర నిఘా సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే సీమా హైదర్, సచిన్ మీనా అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే స్పందించిన అధికారులు సచిన్ మీనా, సీమా హైదర్ లను ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందించారు. వరుసగా దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టడంతోనే ఈ ప్రేమజంట అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతానికి వీరిద్దరు ఆరోగ్యంగా ఉన్నట్లు సమాచారం. వీసా లేకుండా భారత్ లోకి ప్రవేశించినందుకు సీమాను, అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించినందుకు సచిన్ మీనాను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
ఈ వ్యవహారంపై యూపీ పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నాయి. ఈ క్రమంలో సీమా హైదర్ రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, యూపీ సిఎంలకు లేఖలు రాసింది. సచిన్ ను పెళ్లి చేసుకున్న తర్వాత తను ఇక్కడే ఉండిపోతానని, చావనైన చస్తాను గాని పాకిస్తాన్ వెళ్లనని మీడియా ముఖంగా వెళ్లడించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన భర్త సచిన్ మీనా ఇంట్లో నివసించడానికి తనకు అనుమతించాలని సీమా హైదర్ కోరింది. భారత పౌరసత్వం కోరుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్మూకు సుప్రీం కోర్టు లాయర్ ద్వారా పిటిషన్ దాఖలు చేశారు. దరఖాస్తులో సచిన్ మీనాతో తన పెళ్లికి సంబంధించిన ఫొటోలను జత చేశారు. మరి దీనిపై రాష్ట్రపతి భవన్ ఏవిధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.