ఒక బిడ్డ పుడితేనే తల్లిదండ్రులు సంతోషిస్తుంటారు. అలాంటిది కవలలు పుడితే వాళ్ల ఆనందానికి హద్దులుండవనే చెప్పొచ్చు. మరో కాన్పు కోసం చూడాల్సిన అవసరం ఉండదు కాబట్టి.. ఒకేసారి ఇద్దరు పుడితే డబుల్ హ్యాపీనే కదా. కవలల పిల్లల విషయంలో కొన్ని నిమిషాల తేడాతో పుట్టడం సాధారణమే. కొందరు కవలలు అయితే వేర్వేరు తేదీలు, వేర్వేరు నెలలు, వేర్వేరు సంవత్సరాల్లోనూ పుట్టారు. అయితే ఇక్కడో చిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ గర్భంలో కవలలు ఉండగా, వారిలో ఓ శిశువు తల్లి కడుపులో 23 వారాలకే మృతి చెందింది. అయితే, రెండో బిడ్డ మాత్రం పూర్తి ఆరోగ్యంతో 52 రోజుల తర్వాత పుట్టడం విశేషం.
ఒడిశా రాష్ట్రంలోని కటక్ జిల్లా, కెండుపట్నాకు చెందిన 31 ఏళ్ల పార్వతీ బెహరా ఓ ఐవీఎఫ్ సెంటర్లో ట్రీట్మెంట్ చేయించుకున్నారు. కృత్రిమ గర్భధారణ పద్ధతిలో ఆమె గర్భంలో రెండు పిండాలు ఏర్పడ్డాయి. 23 వారాల తర్వాత (అక్టోబర్ 29న) నొప్పులు రావడంతో కేసు తీవ్రతను ఐవీఎఫ్ సెంటర్ నిర్వాహకులు గుర్తించి భువనేశ్వర్ లోని కలింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్)కు సిఫార్సు చేశారు. దీంతో అక్కడి డాక్టర్లు ట్రీట్మెంట్ చేయడానికి చేయడానికి రెడీ అయ్యారు. కానీ దురదృష్టవశాత్తూ గర్భంలోని కవలల్లో ఒక శిశువు మృతి చెందింది. ఆ పిండాన్ని తొలగించారు.
ఫలించిన డాక్టర్ల ప్రయత్నం.. తల్లీబిడ్డ క్షేమం
పార్వతి గర్భంలోని ఒక శిశువు చనిపోయినప్పటికీ.. మరో శిశువును బతికించేందుకు డాక్టర్లు శతవిధాలా ప్రయత్నించారు. ఓ వైపు గర్భిణి షుగర్ వ్యాధితో బాధపడుతుండటం.. మరోవైపు ఒబెసిటీ, హైపోథైరాయిడ్ లాంటి ప్రతికూల అంశాలు కూడా తోడయ్యాయి. అయినప్పటికీ ఆమె విషయంలో స్పెషల్ కేర్ తీసుకుని చికిత్స చేశారు. దీంతో డిసెంబర్ 19న పండంటి మగబిడ్డకు పార్వతి జన్మనిచ్చింది. పుట్టిన సమయంలో బిడ్డ బరువు 1,370 గ్రాములు మాత్రమే. దీంతో చిల్డ్రన్స్ వార్డులో 48 గంటల పాటు ఆక్సిజన్ అందించారు. కొన్ని రోజుల పాటు ముక్కుతో మాత్రమే పాలు ఇచ్చారు. బిడ్డ బరువు పెరగడం, ఆరోగ్యంగా ఉండటంతో తర్వాత నోటి ద్వారా పాలను ఇస్తున్నారు. ప్రస్తుతం తల్లీబిడ్డలు పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఇలాంటి ఘటనలు దేశంలో రెండు, మూడు చోటు చేసుకున్నప్పటికీ.. ఒడిశాలో మాత్రం ఇదే ప్రథమం అని అక్కడి డాక్టర్లు చెబుతున్నారు.