నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) ఓ వ్యక్తిపై భారీ రివార్డు ప్రకటించింది. ఏకంగా 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పుకొచ్చింది. ఎన్ఐఏ ఇంత భారీ రావార్డు ప్రకటించింది అంటే.. ఆ వ్యక్తి ఎంత పెద్ద నేరస్తుడో అర్థం చేసుకోవచ్చు. మరి సదరు వ్యక్తి ఎవరు.. ఎందుకు ఇంత భారీ రివార్డు ప్రకటించారు అంటే.. సదరు వ్యక్తి.. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు కాబట్టి. గాజర్ల రవి అలియాస్ ఉదయ్పై ఎన్ఐఏ ఈ భారీ రివార్డు ప్రకటించింది. అతడి ఆచూకీ తెలిపిన వారికి రూ.10 లక్షల రివార్డు ఇస్తామని ప్రకటన జారీ చేసింది. ఈ మేరకు ఒడిశాలో ఎన్ఐఏ పోస్టర్లు ఏర్పాటు చేసింది. అలానే మరో ముగ్గురిపై కూడా ఎన్ఐఏ ఇలా రివార్డులు ప్రకటించింది.
తూర్పుగోదావరి జిల్లాకు చెందిన జాలమూరి శ్రీను, శ్రీకాకుళం జిల్లాకు చెందిన మెట్టూరు జోగా అలియాస్ టెక్ శంకర్లపై రూ.5 లక్షల చొప్పున.. మల్కన్గిరికి చెందిన చంటిలపై రూ.2 లక్షల రివార్డు ఎన్ఐఏ ప్రకటించింది. ఈ నలుగురిలో ఇద్దరు ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో ప్రత్యేక జోనల్ కమిటీలో కార్యకలాపాలు సాగిస్తుండగా.. గాజర్ల రవి మాత్రం ప్రస్తుతం ఏపీ, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దుల్లోని ఏవోబీఎస్జడ్సీ ట్రై జంక్షన్ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ జంక్షన్ గుండా మావోయిస్టులు.. ఆయా రాష్ట్రాలకు రాకపోకలు సాగిస్తున్నారని పోలీసులు తెలిపారు.
దట్టమైన ఈ అడవి ప్రాంతంలో గాజర్ల రవికి మంచి పట్టు ఉన్నట్లు ఎన్ఐఏ చెబుతోంది. గాజర్ల రవిది.. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని చిట్యాల మండలం వెలిశాల గ్రామం. ఇతడిని పట్టుకునేందుకు ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నప్పటికి.. అవేవి సక్సెస్ కావడం లేదు. ఈ నేపథ్యంలో ఎన్ఐఏ అధికారులు ఇలా రివార్డు ప్రకటించారు.
2012లో ఒడిశాలోని మల్కన్ గిరి జిల్లాలో మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో గాజర్ల రవి ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. నాటి కాల్పుల్లో.. నలుగురు బీఎస్ఎఫ్ జవాన్ల మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించే ప్రస్తుతం గాజర్ల రవిపై ఎన్ఐఏ రూ.10 లక్షల రివార్డును ప్రకటించింది. గతంలో ఈ కేసును మల్కాన్గిరి పోలీసులు దర్యాప్తు చేయగా… ఆ తర్వాత ఎన్ఐఏ చేతుల్లోకి వెళ్లింది. అప్పటి నుంచి దర్యాప్తు వేగవంతం అయ్యింది. దానిలో భాగంగా ఇలా రివార్డు ప్రకటించింది.