గురు బ్రహ్మా.. గురు విష్ణు.. గురు దేవో మహేశ్వర అంటారు. తల్లిదండ్రులు కనీ పెంచితే వారికి విద్యాబుద్దులు నేర్పించి ప్రయోజకులను చేసే బృహత్కర బాధ్యత గురువులు తీసుకుంటారు. అందుకే గురువులను దేవుడితో పోల్చుతారు. ఈ కాలంలో ఎవరి స్వార్థం వారే చూసుకుంటున్నారు.. డబ్బు కోసం ఎంతటి నీచమైన పనులకైనా తెగబడుతున్నారు. కానీ కొంత మంది మాత్రం పరుల సేవకు తమ జీవితాన్ని అర్పిస్తున్నారు. ఓ గురువు తన జీవిత కాలం కష్టపడిన సొమ్ము పేద విద్యార్థులకు విరాళంగా ఇచ్చేసి తన పెద్ద మనసును చాటుకున్నారు. 39 సంవత్సరాలపాటు ఉపాధ్యాయుడిగా పనిచేసిన ఆయన ఆ కాలంలో సంపాదించిన తన కష్టార్జితం మొత్తం రూ. 40 లక్షలను పేద పిల్లల చదువు ఇవ్వడంపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇది చదవండి : ఎంఎస్ ధోనిని కలిసిన హీరో విక్రమ్.. మహాన్ కోసమేనా?
ఒక ఉపాధ్యాయుడిగా వేలాదిమందిని తీర్చిదిద్దినప్పటికీ అది ఆయనకు సంతృప్తినివ్వలేదు. పేద విద్యార్థుల కోసం ఏదో ఒకటి చేయాలన్న తపన ఆయనకు కలిగింది. ఆ ఉపాధ్యాయుడి పేరు విజయ్ కుమార్ చాన్సోరియా. మధ్యప్రదేశ్లోని పన్నా జిల్లాలోని ఖాందియాకు చెందిన ఆయన ఉద్యోగ విరమణ సందర్భంగా తీసుకున్న నిర్ణయమిది. దాదాపు నలబై ఏళ్లు కష్టపడి కూడబెట్టుకున్న సొమ్ము పరులకు దానం చేసిన ఆయన భార్యాబిడ్డలు కూడా ఏమాత్రం వ్యతిరేకించలేదు. వారి అనుమతితోనే తాను ఇన్నాళ్లుగా దాచుకున్న పీఎఫ్, గ్రాట్యుటీ నిధులను పేద విద్యార్థులకు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు.
తాను రిక్షా తొక్కి, పాలు అమ్మి చదువుకున్నానని, చదువంటే ఆసక్తి ఉన్న పేద విద్యార్థులకు ఆ కష్టం రాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు విజయ్ కుమార్ చాన్సోరియా. ప్రపంచంలోని బాధలన్నింటినీ మనం తగ్గించలేమని, కానీ మనం చేయాల్సిన కాసింత మంచినైనా చేద్దామని అన్నారు. ఆయన చేసిన గొప్ప పనికి ఎంతో మంది నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంత మంది ఉపాధ్యాయుడి గురించి మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.