అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానాన్ని పంచే కొందరు గురువులు విచక్షణ కోల్పోతున్నారు. దురుసుగా ప్రవర్తించి ఉపాధ్యాయలోకానికి మచ్చ తెస్తున్నారు. ఓ స్కూల్లో సహనం కోల్పోయిన మహిళా టీచర్ విద్యార్థిని తల్లి చెంపపై కొట్టింది.
బావిభారత పౌరులను తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులు సహనం కోల్పోయి ప్రవర్తిస్తున్నారు. ఉపాధ్యాయ వృత్తికి కలంకం తెస్తున్నారు. విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే గురువులను దైవంతో సమానంగా భావిస్తారు. కొందరు ఉపాధ్యాయులు వారి దురుసు ప్రవర్తనతో, వికృత చేష్టలతో వారిపై ఉన్న గౌరవాన్ని కోల్పోతున్నారు. ఇదే అంశానికి చెందిన విషయంలో ఓ టీచర్ విద్యార్థిని తల్లిపై చేయిచేసుకుంది. స్కూల్ ప్రధానోపాద్యాయుడి ముందే ఆగ్రహంతో ఊగిపోతూ దాడికి పాల్పడింది. ఈ హఠాత్పరిణామంతో అంతా షాక్ కు గురయ్యారు. ఆ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని పొద్దుటూరులోని పాఠశాలలో చోటుచేసుకుంది. అక్కడ ఉన్న ఓ వ్యక్తి ఈ తతంగాన్నంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది కాస్త వైరల్ గా మారింది. దీనికి సంబంధించిన వివరాలు మీకోసం..
విద్యార్థులు హోం వర్క్ చేయకపోతేనో లేదా చదవకపోతేనే ఏ టీచర్లైన పనిష్మెంట్ ఇవ్వడం సహజం. విద్యార్థులు తరగతి గదిలో అల్లరిచేస్తే టీచర్లు వారిని రెండు దెబ్బలేసి కంట్రోల్ చేయడం మామూలుగా జరిగే విషయమే. కానీ పొద్దుటూరులో ఉన్న ఎద్దుల సుబ్బమ్మ బాలికల పాఠశాలలో సునంద అనే టీచర్ లహరి అనే విద్యార్థినిని రోజు కొడుతోందని తెలిసింది. అయితే ఇదే విషయాన్ని తన తల్లికి చెప్పింది లహరి. పదే పదే ఎందుకు కొడుతుందో అడుగుదామని ఈ రోజు(శనివారం) మధ్యాహ్నం స్కూలుకు వెళ్లింది. తన కూతురును ఎందుకు కొడుతున్నారంటూ ప్రధానోపాద్యాయుడి ముందు ఆ టీచర్ ను నిలదీసింది. అక్కడ పాఠశాల టీచర్లు, ప్రధానోపాద్యాయుడు, విద్యార్థిని తరఫున వచ్చిన వాళ్లు మాట్లాడుతుండగానే సహనం కోల్పోయిన టీచర్ సునంద ఆగ్రహం చెంది విద్యార్థిని లహరి తల్లిపై చేయిచేసుకుంది. దీంతో అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. వెంటనే అక్కడున్న మిగతా టీచర్లు కలుగజేసుకుని వారిని బయటికి పంపించారు. ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలిసింది. కాగా టీచర్ దురుసు ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.