రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. పీఎం కిసాన్ నిధుల విడుదల గురించిన అంశంపై కేంద్రం కీలక సమాచారాన్ని అందించింది.
వ్యవసాయం చేసి సరైన పంట దిగుబడి రాక అప్పులపాలవుతున్న రైతులను ఆదుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలను ప్రవేశపెట్టాయి. అకాల వర్షాలు, పంటలో వచ్చే వివిధ రకాల తెగుళ్లతో పంట నష్టపోయిన రైతులకు నష్ట పరిహారాలు అందించి ఆర్థికంగా ఆదుకోవడానికి ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. దేశానికి అన్నం పెట్టే రైతును రాజును చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని తీసుకొచ్చింది. దీనిలో భాగంగా రైతులకు ఏటా నాలుగు నెలలకొకసారి మూడు విడతల్లో కలిపి ఆరు వేల రూపాయలను రైతుల ఖాతాల్లో నేరుగా జమచేస్తుంది. కాగా ఇప్పటికే 13 విడతలు పూర్తి కాగా 14వ విడతకు సంబంధించిన నిధులు త్వరలో విడుదల కానున్నాయి. దీనికి సంబంధించిన కీలక అప్ డేట్ ను కేంద్రం అందించింది.
ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన వేళ రైతులకు కేంద్రం తీపి కబురును అందించింది. పీఎం కిసాన్ డబ్బులు ఆ తేదీన జమకానున్నాయి అని స్పష్టం చేసింది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 14వ విడత డబ్బులు ఇప్పటికే విడుదల చేయాల్సి ఉండగా వివిధ కారణాల వల్ల ఆలస్యమైందని అధికారులు వెల్లడించారు. కాగా 14వ విడత డబ్బులను జూలై 28వ తేదీన రైతుల ఖాతాల్లో జమచేసేందుకు కేంద్రం నిర్ణయంతీసుకుంది. ఆ రోజున రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా సుమారు 9 కోట్ల మంది రైతులు లబ్ధిపొందనున్నారు. ఈకేవైసీ పూర్తి చేసుకోని రైతులు త్వరగా దానికి సంబంధించిన ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు తెలిపారు. దీంతో పాటుగా రైతులు తమ బ్యాంక్ అకౌంట్ తో ఆధార్ నంబర్ లింక్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలా అన్ని ప్రక్రియలు పూర్తి చేసిన వారికి డబ్బులు జూలై 28న అకౌంట్ లలో జమకానున్నాయి.