లాటరీలో ఓ కార్మికుడు రూ. కోటి నగదు గెలుచుకున్నాడు. పోలీస్ స్టేషన్ కు వెళ్లి.. తనకు రక్షణ కావాలని కోరాడు. కార్మికుడికి ప్రాణ హాని ఉందేమోనని పోలీసులు భావించారు. ఇంతలో..
అనుకోకుండా కలిసి వచ్చే దానిని అదృష్టం అంటారు. అసలు అదృష్టం అంటే నమ్మలేని నిజాలను మించి అనుకోకుండా మంచి జరిగితే దానిని అదృష్టం అని అంటారు. నమ్మిన దానికి మించి నష్టం వాటిల్లితే దానిని దురదృష్టం అంటారు. మనం ఏ పని చేసినా కూడా కేర్ఫుల్గా చేయాలి. మనం చేస్తున్న పనియందే నిమగ్నమైతే ఆ పని త్వరగా విజయవంతం అవుతుంది. జీవితంలో ఏదో ఓ సారి అదృష్టం తలుపు తడుతుంది. అలాగే కేరళలో పని చేస్తున్నఓ వలస కార్మికుడికి కూడా అదృష్టం కలిసి వచ్చింది. అతను కొన్న లాటరీ టికెట్ నంబరుకు రూ. కోటి నగదు తగిలింది. దీనితో అతను అంతపెద్ద మొత్తం డబ్బులు నిర్వాహకుల దగ్గర నుండి ఎలా తీసుకోవాలో తెలియలేదు. ఎలా మ్యానేజ్ చేయాలో.. ఇలా అనేక విషయాలతో సతమతమవుతూ పోలీసులను ఆశ్రయించాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..
కేరళలో బిర్షు రాంబ అనే యువకుడు నివాసముంటున్నాడు. అతడు పశ్చిమబెంగాల్ కు చెందిన వలస కార్మికుడు. ప్రస్తుతానికి అతను కేరళలో పనిచేస్తున్నాడు. గత సోమవారం ‘ఫిఫ్టీ-ఫిఫ్టీ’ అనే లాటరీ టికెట్ కొన్నాడు. ఆ నంబరుకు రూ. కోటి నగదు బహుమతి గెలుపొందాడు. దీంతో అతనిపై అనుకోకుండా ఎవరైనా దాడి చేసే అవకాశం ఉందని దిగులుతో పోలీసులను ఆశ్రయించాడు. ఈ క్రమంలో తంపనూర్ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించాడు. బిర్షు రాంబ గెలుపొందిన లాటరీ గురించి అన్ని వివరాలను పోలీసులకు వివరించాడు. తనకు భద్రత కావాలని కోరాడు. అంత పెద్ద మొత్తంగా డబ్బు తను ఎప్పుడు చూడలేదని.. లాటరీ నిర్వాహకుల నుండి డబ్బులు ఎలా పొందాలో తనకు తెలియదని పోలీసులకు వెల్లడించాడు. నిర్వాహకుల నుండి నగదు ఇప్పించాలని అభ్యర్థించాడు. దీంతో పోలీసులు అతనికి సహకరించేందుకు అంగీకరించారు. డబ్బులను చాలా జాగ్రత్తగా వాడుకోవాలని రాంబకు సూచించారు. మొదట రాంబ పోలీసులను ఆశ్రయించగానే ఎవరైనా అతనిని వెంబడిస్తున్నారేమోనని.. ప్రాణహాని ఏదైనా ఉందేమో అని అనుకున్నారు. ఆ తర్వాత విషయం తెలిసి పోలీసులు అవాక్కయ్యారు.