ప్రముఖ పారిశ్రామికవేత్త, కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ నవీన్ జిందాల్కు బెదిరింపు లేఖ రావడం.. అది కూడా జైల్లోని ఓ ఖైదీ పంపడం స్థానికంగా సంచలనం రేపుతోంది. 48 గంటల్లో.. 50 కోట్ల రూపాయలు ఇవ్వకపోతే.. జిందాల్ను చంపుతామని బెదిరిస్తూ లేఖ పంపాడు ఓ ఆగంతకుడు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు.. ఛత్తీస్గఢ్లోని పాత్రపాలిలో ఉన్న జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ సంస్థకు జనవరి 18న పోస్టు ద్వారా ఈ బెదిరింపు లేఖ వచ్చింది. దాన్ని తెరిచి చూడగా.. నవీన్ జిందాల్ 48 గంటల్లోగా రూ.50కోట్లు ఇవ్వాలని, లేదంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని లేఖలో హెచ్చరించాడు. దీంతో జిందాల్ సంస్థ.. లేఖ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. బిలాస్పుర్ సెంట్రల్ జైలులో ఉంటున్న ఓ ఖైదీ ఈ లేఖ రాసినట్టు గుర్తించారు. పుష్పేంద్ర చౌహన్ అనే ఖైదీ లేఖ పంపినట్టు పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాయ్గఢ్ ఎస్పీ అభిషేక్ మీనా మాట్లాడుతూ.. ‘‘జనవరి 18న నవీన్ జిందాల్ను బెదిరిస్తూ పాత్రపాలి కంపెనీకి పోస్ట్ ద్వారా ఓ లేఖ వచ్చిందని.. మాకు ఫిర్యాదు అందింది. దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాం. దర్యాప్తులో భాగంగా బిలాస్పూర్ సెంట్రల్ జైలులో ఉన్న పుష్పేంద్ర చౌహన్ అనే ఖైదీ ఈ లేఖ రాశాడని తెలిసింది. అతడు గత మూడు నాలుగేళ్లుగా జైలులోనే ఉంటున్నాడు’’ అని తెలిపాడు.
అయితే ఈ నిందితుడికి ఇటువంటి చర్యలు కొత్తకాదని, గతంలోనూ అతడిపై.. ఇలాంటివే ఒకటి రెండు కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు ఎస్పీ. గతంలో పుష్పేంద్ర.. ఛత్తీస్గఢ్ గవర్నర్, రాష్ట్రపతిలను కూడా చంపుతానంటూ లేఖలు పంపాడని.. అయితే అతడి మానసిక స్థితి సక్రమంగా లేకపోవడం వల్లే ఇలా చేస్తున్నాడని ఎస్పీ వివరించారు. జైల్లో ఉన్న ఖైదీ.. ఓ పారిశ్రామికవేత్తను బెదిరిస్తూ లేఖ పంపడం చూస్తే.. భద్రతా ఫైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది అంటున్నారు. మరి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.