రోజురోజుకు మనుషుల్లో విచక్షణ, మానవత్వం నశిస్తున్నాయి. చిన్న చిన్న విషయాలకు కూడా తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి గుజరాత్లో చోటు చేసుకుంది. కుక్క పిల్ల పేరు విషయంలో వివాదం మొదలై.. మహిళను సజీవదహనం చేసే వరకు వెళ్లింది. ఆ వివరాలు..
గుజరాత్ భగవాన్ నగర్ కు చెందిన నీతాబెన్ సర్వయ(35) అనే మహిళ ఓ కుక్క పిల్లను పెంచుకుంటుంది. దానికి సోను అనే పేరు పెట్టింది. ఆ పేరే ఆమె ప్రాణాల మీదకు తెచ్చింది. ఎందుకంటే.. నీతాబెన్ ఇంట పక్కనే ఉండే భర్వాద్ భార్య ముద్దు పేరు కూడా సోనునే. నీతాబెన్ కావాలనే తన భార్యను కించపర్చడానికే ఆమె పెంపుడు కుక్కకు సోను అని పేరు పెట్టిందని భావించాడు భర్వాద్.
ఈ క్రమంలో భర్వాద్, కొందరు వ్యక్తులను తీసుకుని నీతాబెన్ ఇంటికి వెళ్లి.. ఆమెతో గొడవపడ్డాడు. ఆ సమయంలో నీతాబెన్, ఆమె కుమారుడు మాత్రమే ఇంట్లో ఉన్నారు. భర్త పొలానికి వెళ్లాడు. గొడవ పెద్దది చేయడం ఇష్టం లేని నీతాబెన్ వారిని తప్పించుకోవడం కోసం కిచెన్లోకి వెళ్లింది. భర్వాద్ మనుషులు కూడా ఆమె వెనకే లోపలికి వెళ్లారు.
భర్వాద్ మనుషుల్లో ఒక వ్యక్తి నీతాబెన్ మీద కిరోసిన్ పోసి నిప్పంటించాడు. బాధకు తాళలేక ఆర్తనాదాలు చేయడంతో వారు అక్కడ నుంచి పరారయ్యారు. నీతాబెన్ అరుపులు విన్న ఇరుగుపొరుగు వారు ఆమె నివాసానికి వచ్చారు. మంటలను ఆర్పి.. ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో నీతాబెన్ తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. విషయం తెలుసుకున్న పోలీసులు భర్వాద్ మనుషుల మీద కేసు నమోదు చేశారు.