ఈ కాలంలో పక్క వారికి ఏం జరిగినా.. ఎన్ని కష్టాల్లో ఉన్నా మనకేంటీ అనుకుంటూ వెళ్లిపోయేవారు ఉన్నారు. కానీ కొన్ని సంక్షోభ సమయాల్లో మానవత్వం చూపిస్తూ ఆర్థికంగా కొందరు, రక్త దానం చేస్తూ కొందరు.. సర్వం కోల్పోయిన అనాధల సంరక్షణ బాధ్యతలు తీసుకునే వారు ఉన్నారు.
ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలో జరిగిన రైళ్ల ప్రమాదం దేశం అంతా ఉలిక్కిపడేలా చేసింది. గమ్యస్థానం చేరుకుంటామని భావిస్తున్న సమయంలో అనంత లోకాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే మూడు రైళ్లు ఢీకొనడంతో పెద్ద ప్రమాదం సంభవించింది. ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 288 మంది చనిపోగా.. వెయ్యి మందికి పైగా గాయాలపాలయ్యారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగింది. అంతేకాదు క్షతగాత్రులను ఆదుకునేందుకు వివిధ సేవా సంస్థల నుంచి వాలంటీర్లు వచ్చారు. బాధితులను రక్తదానం చేసి ఆదుకోవడానికి వేల సంఖ్యలో యువత కు దేశం హ్యాట్సాఫ్ చెబుతుంది. వివరాల్లోకి వెళితే..
ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంలో తీవ్ర దుఖాఃన్ని మిగిల్చింది. వందల మంది చనిపోయారు.. వెయ్యి మందికి పైగా గాయాలపాలయ్యారు. ఓ వైపు బాధితులను ఆదుకునేందుకు రెస్క్యూ టీమ్ ఎంతో శ్రమిస్తుంది.. దాంతో పాటు స్థానికులు కూడా సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి యువత స్వచ్చందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు. అర్థరాత్రి సమయంలో గంటల కొద్ది క్యూ లైన్ లో నిలబడి మరీ బాధితులకు అవసరమైన రక్తం దానం చేశారు. కటక్, బాలాసోర్, భద్రక్ లలో 2023, జూన్ 2 శుక్రవారం రాత్రి నుంచి దాదాపు 3 వేల యూనిట్లకు పైగా రక్తాన్ని సేకరించామని.. రక్తదానం చేసేందుకు యువత స్వచ్చందంగా తరలి రావడం ఎంతో సంతోషంగా ఉందని ఎస్సీబి మెడికల్ కాలేజీ హాస్పిటల్ లో మెడిసిన్ ప్రొఫేసర్ జయంత్ పాండా అన్నారు.
రక్తదానం చేసిన వారిలో యువతులు, మహిళలు కూడా ఉన్నారని.. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకొకి ఈ భూమిపై ఇంకా మానవత్వం ఉందని చాటి చెప్పారని ఆయన అన్నారు. అంతేకాదు కొంతమంది సర్వం కోల్పోయి అనాథ చిన్నారులను సంరక్షణ బాధ్యత తీసుకున్నారని.. మరికొంతమంది తమ సొంత వాహనాల్లో సమీప ఆసుపత్రులకు క్షతగాత్రులను తరలించారని పేర్కొన్నారు. ఇలాంటి సంక్షోభంలో ఉన్నపుడు సాటి వారిని ఆదుకొని మానతవ్వం చూపించిన వారి పట్ల నెటిజన్లు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.