రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ మానవత్వాన్ని చాటుకున్నారు. సాయం కోరుతూ తన వద్దకు వచ్చిన ఒక వ్యక్తికి ఆయన అండగా నిలిచారు.
మానవ సంబంధాల్లో రానురాను అనూహ్య మార్పులు వస్తున్నాయి. సాటి మనిషి గురించి ఆలోచించేవాళ్లు చాలా తక్కువైపోయారు. మానవత్వం క్రమంగా మాయమైపోతున్న రోజులివి. ఎవరి పనుల్లో వాళ్లు బిజీ అయిపోతున్నారు. కుటుంబీకులు, స్నేహితులు, ఆప్తులతో రిలేషన్స్ తగ్గిపోతున్నాయి. బంధాల్లో ఆత్మీయత, అనురాగం, ప్రేమకు బదులుగా స్వార్థం, అవసరం లాంటివి వచ్చి చేరుతున్నాయి. ఏ బంధమైనా ఆర్థిక బంధం తర్వాతే అన్నట్లుగా పరిస్థితులు తయారవుతున్నాయి. అవసరం లేదనుకుంటే ఎవరితోనైనా బంధాన్ని ఈజీగా తెంపుకొని దూరమవుతున్న ఘటనలు అనేకం చూస్తున్నాం. ఇలా ఒక వ్యక్తి పక్షవాతంతో మంచాన పడి భారంగా మారాడు. దీంతో అతడ్ని భార్యతో సహా కుటుంబ సభ్యులంతా వదిలేశారు. అందరూ వదిలేసి వెళ్లడంతో అతడు రోడ్డున పడ్డాడు.
యాదాద్రి జిల్లా, సంస్థాన్ నారాయణపూర్కు చెందిన కిషన్ అనే వ్యక్తి ఆటో డ్రైవర్గా పని చేస్తుండేవాడు. నాలుగేళ్ల కింద అతడు పక్షవాతానికి గురై మంచాన పడ్డాడు. అయితే అతడ్ని భార్య సహా కుటుంబీకులు వదిలేసి వెళ్లిపోయారు. దీంతో ఒంటరిగా మారిన కిషన్.. తనకు సాయం చేయాలంటూ రాచకొండ సీపీని కలిశాడు. బాధితుడు నడవలేని పరిస్థితిలో ఉన్నా ఎంతో కష్టపడి రాచకొండ పోలీసు కమిషనర్ ఆఫీస్కు చేరుకున్నాడు. అతడి పరిస్థితి తెలుసుకున్న సీపీ డీఎస్ చౌహాన్ చలించిపోయారు. వెంటనే తన ఛాంబర్ నుంచి బయటకు వచ్చి అతడ్ని కలిశారు. బాధితుడి నుంచి కంప్లయింట్ తీసుకొని అతడి కుటుంబ సభ్యులను పిలిపించారు చౌహాన్. కిషన్ను బాగా చూసుకోవాలని వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. అధికార దర్పాన్ని ఏమాత్రం ప్రదర్శించకుండా బాధితుడి వద్దకు వెళ్లి కంప్లయింట్ తీసుకున్న సీపీ చౌహాన్ను అందరూ మెచ్చుకుంటున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదే కదా అని ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు.