సర్కార్ దవాఖానల్లో కొన్ని చోట్ల అరకొర సదుపాయాలతో రోగులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తుందనడానికి ఓ ఉదాహరణ ఈ సంఘటన.
సర్కార్ ఆస్పత్రుల్లో అన్ని సౌకర్యాలు ఉంటాయని అనుకుంటాం.. కానీ ఒక్కొక్కసారి అరకొర సదుపాయాలతో రోగులు చాలా ఇబ్బందులకు గురవుతారు. అక్కడి సిబ్బంది నిర్లక్ష్య వైఖరితో పేషెంట్స్ ప్రాణాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వ ఆస్పత్రిలో మరోసారి సిబ్బంది నిర్వాకం బయట పడింది. వారు చేసే పనులను చూసి షాక్ కు గురవువ్వాల్సి వస్తుంది. తాజాగా తమిళనాడులోని ఉత్తరమేరూర్ ఆస్పత్రిలో ఆక్సిజన్ మాస్క్కు బదులుగా టీ కప్ను వినియోగించారు. దీంతో పక్కనున్న వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
తమిళనాడు కాంచీపురం జిల్లా ఉత్తరమేరూర్లో ఓ స్టూడెంట్కి తరగతి గదిలో అనుకోకుండా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడింది. టీచర్స్ ఆ అబ్బాయి పేరెంట్స్ కి సమాచారం అందించారు. ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు ఆ అబ్బాయిని పరీక్షించి ఊపిరి పీల్చడానికి ఆక్సిజన్ మాస్క్ పెట్టాలని సూచించారు. అయితే వార్డులో మాస్క్ లేకపోవడంతో టీ కప్పుకు రంధ్రం చేసి ఆక్సిజన్ సిలిండర్ నుండి ట్యూబ్కు కనెక్ట్ చేసి విద్యార్థికి ఇచ్చారు.
ఇదంతా చూసిన ఓ రోగి తన సెల్ ఫోన్తో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నట్టింట వైరల్గా మారింది. ఈ వీడియో కాస్త తమిళనాడు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రహ్మణ్యన్ వరకు వెళ్లింది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ను విచారణ కొరకు ఆదేశించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. ఉన్నత స్థాయి విచారణకు ఆరోగ్యశాఖ మంత్రి ఆదేశించినట్లు వివరణ ఇచ్చారు. దీనిపై మీ కామెంట్స్ తెలియజేయండి.