ఇటీవల దేశంలో పలు చోట్ల తరుచూ రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. సాంకేతిక లోపాల వల్ల కొన్ని అయితే.. మానవ తప్పిదాల వల్ల, రైలు పట్టాలు తప్పడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు.
ఇటీవల దేశ వ్యాప్తంగా పలు చోట్ల వరుసగా రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. సాంకేతిక లోపాలు, మానవ తప్పిదాల వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. రైలు ప్రమాదాల వల్ల ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతుంది. ఒడిశాలోని బాలాసోర్ జిల్లా బహనాగ బజార్ రైల్వే స్టేషన్ వద్ద జూన్ 2 వ తేదీన నిమిషాల వ్యవధిలో మూడు రైళ్లు ప్రమాదానికి గురై 290 మందికి పైగా మృత్యువాత పడ్డారు. 1000 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. రాంగ్ సిగ్నలింగే కారణమని ఇటీవల రైల్వే భద్రత కమిషనర్ సీఆర్ఎస్ దర్యాప్తు నివేదికలో చెప్పిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం తర్వాత మరికొన్ని ప్రమాదాలు జరిగాయి. నర్సింగ్ పూర్ జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో ఆ మార్గంలో రైలు రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని అధికారి ఒకరు ఆదివారం తెలిపారు. వివరాల్లోకి వెళితే..
మధ్యప్రదేశ్ నర్సింగ్ పూర్ జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పడం తీవ్ర కలకలం రేపింది. నర్సింగ్ పూర్ జిల్లాలో శనివారం రాత్రి 11.30 గంటలకు జరిగిన ఈ ఘటన ఎవరికీ గాయాలు కాలేదని పశ్చిమ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ రాహల్ శ్రీ వాస్తవ తెలిపారు. కాగా, గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో జబల్పూర్-ఇటార్సీ ఆఫ్ లైన్ లో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడినట్లు తెలిపారు. రైల్వే సిబ్బంది రంగంలోకి దిగి ప్రాబ్లమ్ క్లియర్ చేసే పనిలో పడ్డారని అన్నారు. ఇతర రైళ్లను ఇటార్సీ నుంచి జబల్ పూర్ వైపు మళ్లించామని, ఆఫ్ లైన్ లో ట్రాఫిక్ పూర్తిగా పునరుద్దరించబడిందని అన్నారు.
ఆదివారం ఉదయం 9.30 వరకు రాకపోకలను పూర్తిగా పునరుద్దరించినట్లు అధికారి తెలిపారు. గత వారంలో జైపూర్ లో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. జులై 15న జైపూర్ సమీపంలో గూడ్స్ రైలుకు చెందిన రెండు వ్యాగన్లు పట్టాలు తప్పడంతో కనీసం ఏడు రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం జైపూర్ – మదర్ రైల్వే సెక్షన్ లో అసల్ పూర్ బాజ్నర్- హిర్నోడా స్టేషన్ల మధ్య ఈ ప్రమాదం జరిగినట్లు అధికారి తెలిపారు. మొత్తానికి ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాలేదు. కాగా, దేశంలో అత్యంత రద్దీగా ఉండే రైల్వే జంక్షన్లలో ఇటార్సీ ఒకటి.