సాధారణంగా విజయాలు ఊరికే రావు.. వాటి కోసం కొన్ని సంవత్సరాలు పోరాడాలి. అలాగని పోరాడినంత మాత్రానా విజయం లభిస్తుందన్న గ్యారంటీ లేదు. అయినా కొంత మంది తమ పోరాటాన్ని విరమించుకోరు. తాజాగా ఇలాంటి ఓ పోరాటమే ప్రస్తుతం విజయం సాధించింది. కొన్ని ఏళ్ల నిరీక్షణకు సుప్రీం కోర్టు పచ్చజెండా ఊపింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్ జర్నలిస్టులకు 12 ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం స్థలాన్ని కేటాయించింది. అయినప్పటికీ వారికి ఆ స్థలాలపై ఎలాంటి అధికారిక హక్కులు రాలేదు. దాంతో వారు ఈ కేసును సుప్రీం కోర్టులో దాఖలు చేయగా తాజాగా విచారణ చేపట్టిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. జర్నలిస్టులకు కేటాయించిన ఇళ్ల స్థలాలను వారికి ఇవ్వడానికి అలాగే వాటిల్లో నిర్మాణానికి సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ కేసుపై జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. ”8వేల జర్నలిస్టులు ఎందుకు కష్టాలు పడాలి. వారి అభ్యర్థనను పరిగణంలోకి తీసుకుంటున్నాం. అలాగే వారికి భూమినైతే ఇచ్చారు కానీ దాన్ని అభివృద్ధి చేయలేదు. అదీ కాక వారు దాని కోసం రూ. 1.33 కోట్లు డిపాజిట్ చేశారు. సాక్ష్యాధారాలు అన్నీ పరిశీలించాక మేం జర్నలిస్టులకు వారి స్థలాల్లో నిర్మాణాలు జరుపుకోవచ్చు అని ఆదేశిస్తున్నాం.
ఇక IAS, IPS, MP లకు సంబంధించిన కేసును మరో బెంచ్ కు బదిలీ చేస్తూ జస్టిస్ ఎన్వీ రమణ ఆదేశించారు. ఈ తీర్పు పై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నాయి జర్నలిస్టు సంఘాలు. తమ న్యాయ బద్దమైన పోరాటం ఈ రోజు విజయం సాధించిందని సంఘ నాయకులు పేర్కొన్నారు. మరి సుప్రీం కోర్టు ఇచ్చిన ఈ తీర్పు పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.