దీపావళి సెలవుల విషయంలో తలెత్తిన వివాదంలో నలుగురు జవాన్లు మృతి చెందారు. తెలంగాణ, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల సరిహద్దలోని పారామిలటరీ బలగాల బేస్ క్యాంప్ లో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఛత్తీస్ గఢ్ లోని సుకుమా జిల్లా సరిహద్దులో లింగంపల్లి బేస్ క్యాంప్ లో సోమవారం తెల్లవారుజామున జవాన్ల మధ్య కాల్పులు జరిగాయి. శిబిరంలోని ఒకరైన కానిస్టేబుల్ రితేష్ రంజన్ తన వద్ద ఉన్న సర్వీస్ తూపాకీతో సహచరులపై కాల్పులకు పాల్పడినట్లు రాయ్ పూర్ ఐజీ సుందర్ రాంజ్ వెల్లడించారు.
ఈ కాల్పులో ఏడుగురు జవాన్లు తీవ్రంగాయపడగా… వారిని వెంటనే భద్రాచలం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే నలుగురు జవాన్లు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతులు రాజమణి రాజకుమార్ యాదవ్, ధన్ జీ, రాజీవ్ మండల్, ధర్మేంద్ర కుమార్ లుగా పోలీసులు గుర్తించారు. వీరిలో ఇద్దరు బీహర్ కు చెందిన వారు కాగా మరో ఇద్దరు బెంగాల్ కు చెందిన వారు. గాయపడిన ముగ్గురి పరిస్థితి కూడా విషమంగా ఉండటంతో ప్రత్యేక హైలికాప్టర్ లో రాయ్ పూర్ కు తరలించారు.
దీపావళి సెలవు విషయంలో తలెత్తిన వివాదం
దీపావళి సెలవులకు సంబంధించిన విషయంలో కానిస్టేబుల్ రితేష్ కు మిగిలిన వారికి మధ్య వివాదం జరిగినట్లు… అనంతరం రితేష్ రంజన్ తన ఏకే-47 గన్ తో కాల్పులకు తెగపడినట్లు పోలీసు వర్గాల సమాచారం. దీనిపై ఇప్పటి వరకు ఎటువంటి అధికారికి సమాచారం రాలేదు.