భారత దేశంలో కొంతకాలంగా ఉగ్రవాదులు గుట్టుచప్పుడు కాకుండా దొంగదెబ్బ తీస్తూ ఎంతోమంది అమాయకులను పొట్టన బెట్టుకుంటున్నారు. సైనికులను లక్ష్యంగా చేసుకొని బాంబుదాడులకు తెగబడుతున్నారు.
దేశంలో కొంతకాలంగా ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. ఓవైపు సైనికులను.. మరోవైపు అమాయక ప్రజలను టార్గెట్ చేసుకొని బాంబుదాడులు, కాల్పులకు తెగబడుతున్నారు. జమ్మూ- కాశ్మీర్ రాష్ట్రం 1989 నుండి తీవ్రవాదంతో బాధపడుతోంది. ముఖ్యంగా కాశ్మీర్, శ్రీనగర్, బారాముల్ల ప్రాంతాల్లో వరుస పేలుళ్లకు తెగబడుతున్నారు ఉగ్రవాదులు. గత మూడు దశాబ్దాలుగా జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదం వివిధ దశల్లో కొనసాగుతూ వస్తుంది. భారత సైనికులు ఎప్పటికప్పుడు దాడులను తిప్పి కొడుతున్నా.. దొంగ దెబ్బ తీస్తూ వస్తున్నారు. కాశ్మీర్ లో ఉగ్రవాదుల దాడిలో ఆంధ్రప్రదేశ్ కి చెందిన సైనికుడు వీరమణం పొందాడు. వివరాల్లోకి వెళితే..
ఇటీవల జమ్మూ-కాశ్మీర్ లో వరుసగా దాడులకు దిగుతున్నారు ఉగ్రవాదులు. పహారా కాస్తున్న సైనికులను టార్గెట్ చేస్తు కాల్పులకు తెగబడుతున్నారు. సోమవారం కాశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడిలో నంద్యాల జిల్లా కృష్ణానగర్ గ్రామానికి చెందిన సురేంద్ర వీర మరణం పొందాడు. గ్రామానికి చెందిన సుబ్బయ్య, సుబ్బమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. వీరిలో చిన్నకుమారుడు సిరిగిరి సురేంద్ర(24) ఐదేళ్ల క్రితం సైన్యంలో చేరాడు. ఆర్మీ జవాను గా విధులు నిర్వహిస్తున్నాడు. నాగ్ పూర్ లో శిక్షణ పూర్తి చేసుకొని గాడ్జ్ రెజిమెంటల్ సెంటర్ లో శిక్షణ పూర్తి చేసుకొని బదునాకు వెళ్లాడు.. అక్కడ నుంచి కాశ్మీర్ లోని బారాముల జిల్లాలోని ఆర్మీ బెటాలియన్ లో విధులు నిర్వహిస్తున్నాడు.
ఈ క్రమంలోనే పాకిస్థాన్ బార్డర్ లో విధులు నిర్వహిస్తున్న సురేంద్రపై జులై 31న మధ్యాహ్నం ట్రక్ పై వచ్చిన ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో వీరమరణం పొందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యలు, బంధువులు కన్నీరుమున్నీరు అయ్యారు. వీర సైనికుడు పార్థీవ దేహాన్ని స్వగ్రామానికి తీసుకురానున్నారు. అనంతరం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. రెండు నెలల క్రితమే సెలవులపై వచ్చి కుటుంబ సభ్యులు, ఊరివారితో ఎంతో సంతోషంగా గడిపిన సురేంద్ర మృత్యు ఒడి చేరడతో కన్నీటి సంద్రంలో మునిగిపోయారు.