డైనోసార్.. రాక్షసబల్లి.. పేరు ఏదైనా కానీ.. దీని గురించి ప్రజలందరికి తెలుసు. హాలీవుడ్ సినిమాలు జురాసిక్ పార్క, డైనోసార్ సినిమాలతో ఈ జీవుల గురించి సామాన్య ప్రజలకు కూడా తెలిసింది. డైనోసార్లు.. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఈ భూమ్మీద నివసించాయి. కోట్ల సంవత్సరాల క్రితం అంతరించిన ఈ జీవులకు సంబంధించిన అవశేషాలు.. నేటికి కూడా ఎక్కడో ఒక చోట వెలుగులోకి వస్తూనే ఉంటాయి. ఈ క్రమంలో తాజాగా డైనోసార్ల గుడ్లు వెలుగులోకి వచ్చాయి. అది కూడా మన దేశంలోనే కావడం విశేషం. నర్మదా నది లోయలో 256 డైనోసార్ గుడ్లు వెలుగులోకి వచ్చాయి. ఆ వివరాలు..
మధ్యప్రదేశ్లోని నర్మదా నదీ పరీవాహక ప్రాంతంలో శాస్త్రవేత్తలు.. ఈ డైనోసార్ గుడ్లను గుర్తించారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్, రీసెర్చ్కు చెందిన శిలాజ శాస్త్రవేత్తలు ధార్ జిల్లాలోని బాగ్, కుక్షి ప్రదేశాల్లో తవ్వకాలు జరిపిన సమయంలో ఈ గుడ్లు వెలుగులోకి వచ్చాయి. డైనోసార్లలో.. పొడవాటి మెడతో ఉండే శాఖాహారులైన టైటానోసార్లకు చెందిన 256 గుడ్లు, పలు గూళ్లు వెలుగులోకి వచ్చాయి. ఈ వివరాలు పీఎల్ఓఎస్ ఒన్ జర్నల్లో ప్రచురితమయ్యాయి.
ఇక్కడ తవ్వకాల్లో బయటపడిన గుడ్లు.. డైనోసార్ జాతికి చెందిన టైటానోసార్లవి అని.. ఇవి సుమారు 6.6 కోట్ల నుంచి 10 కోట్ల సంవత్సరాల క్రితం అంతరించిపోయాయని తెలిపారు. టైటానోసారిడ్ సౌరోపాడ్ కుటుంబానికి చెందిన డైనోసార్లు అని.. ఇవి భూమిపై నివసించిన అతిపెద్ద జంతు జాతుల్లో ఒకటి అని శాస్త్రవేత్తలు తెలిపారు. టైటానోసార్లు ఒక విడతలో పెట్టిన గుడ్లను ఒక గుంతలో పాతిపెట్టడం వల్ల వాటి షెల్స్ ఒకదానిలో ఒకటి ఇరుక్కునట్లు గుర్తించామని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
అంతేకాక ఇక్కడ లభించిన గుడ్లన్నీ అనేక పెంకులతో నిర్మితమై ఉండటాన్ని గమనించామని తెలిపారు. సాధారణంగా పొదగడానికి అనువైన పరిస్థితులు లేనప్పుడు తల్లి తన గుడ్లను అండవాహికలోనే ఉంచుకోవడంతో.. ఇలా పెంకుమీద పెంకు ఏర్పడి ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అంతేకాక.. వాతావరణంలో మార్పులు, వరదలు, జంతువులపై ప్రతికూల ప్రభావం చూపే పరిస్థితుల నేపథ్యంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయని కూడా శాస్త్రవేత్తలు వెల్లడించారు.